మియాపూర్ : కష్టకాలంలో ప్రజలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు. ప్రభుత్వ తోడ్పాటుతో ప్రజలలోనూ భరోసా నెలకొంటుందన్నారు.
శేరిలింగంపల్లి నియోజకవర్గం ఆల్విన్ కాలనీ, శేరిలింగంపల్లి డివిజన్లకు చెందిన మధు, సంజయ్ ప్రసాద్లకు సీఎం సహాయ నిధి పథకం కింద మంజూరైన రూ. 2.54 లక్షల చెక్కులను విప్ గాంధీ సోమవారం తన నివాసంలో బాధిత లబ్దిదారుల కుటుంబాలకు అందించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ప్రజలను ప్రభుత్వం కంటికి రెప్పలా చూసుకుంటుందని, ఆరోగ్య, ఆర్థిక అంశాలలో తోడుగా ఉంటుందన్నారు. ప్రజాసంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ ప్రభుత్వం అనునిత్యం కృషి చేస్తున్నదని పేర్కొన్నారు.
పేదరికంలో ఉండి అనారోగ్యాల బారిన పడుతున్న వారికి వైద్య సహాయానికి సీఎం సహాయ నిధి కొండంత అండగా నిలుస్తున్నదని గాంధీ అన్నారు. ఈ పథకం తన నిరంతర సేవల ద్వారా బాధిత ప్రజలకు భరోసా కల్పిస్తున్నదని, కార్పొరేట్ వైద్యం ద్వారా తమ అనారోగ్యాలకు స్వస్థత పొందారని విప్ గాంధీ తెలిపారు.
ఆపదలో ఆపన్న హస్తంలా సీఎం సహాయ నిధి ఆదుకుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీను పటేల్ పాల్గొన్నారు.