సికింద్రాబాద్ : తెలంగాణలో ధాన్యం కొనుగోళ్ల విషయంలో బీజేపీ అవలంబిస్తున్న ధ్వంద్వ వైఖరిని గల్లీ నుంచి ఢిల్లీ వరకు మరోమారు ఎండగడుతామని, కేంద్రం మెడలు వంచి యాసంగిలో ధాన్యం కొనుగోలు చేసేలా చేస్తామని కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్రెడ్డి అన్నారు.
ఆదివారం తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో అభివృద్ధిని చూసి ఓర్వలేక ధాన్యం కొను గోలు చేయలేమంటూ కేంద్రం చేతులు ఎత్తేసి రైతుల నోట్లో మట్టి కొడుతుందన్నారు. తెలంగాణ బాగుపడడం ఇష్టంలేక రైతు వ్యతిరేక విధానాలతో కేంద్రం ముందుకు పోతుందన్నారు.
వానకాలంలోనే ధాన్యం కొనుగోలు చేయలేమని చెబితే సీఎం కేసీఆర్, మంత్రులు స్వయంగా వెళ్లి 40లక్షల మెట్రిక్ టన్ను లకు జీవోలు తెచ్చారన్నారు. పంజాబ్తోపాటు ఇతర కొన్ని రాష్టాల్లో ధాన్యం కొనుగోలు చేస్తుండగా, కొత్తగా ఏర్పడిన తెలంగాణలో మాత్రం ఎందుకు కొనుగోలు చేయరని ప్రశ్నించారు.
రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు చేసేందుకు కేంద్రం, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ముందుకు రావడం లేదన్నారు. వచ్చే యాసంగిలో రాష్ట్రంలోని రైతాంగం పండించే వ్యవసాయ ఉత్పత్తులన్నింటినీ కేంద్రం బేషరతుగా కొనుగోలు చేస్తామని ప్రక టించే వరకూ తమ పార్టీ పక్షాన ఆందోళన చేస్తామని స్పష్టం చేశారు.
రాష్ట్రంలో రైతులను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందేందుకు బీజేపీ కుట్ర పన్నుతుందని విమర్శించారు. రానున్న కాలంలో ప్రజాక్షేత్రంలో తగిన గుణపాఠం చెబుతామని ఆయన హెచ్చరించారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు ఈ నెల12న రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన రైతు మహాధర్నాలో టీఆర్ఎస్ శ్రేణులు మరోమారు ఉద్యమ స్ఫూర్తిని చాటారాని గుర్తు చేశారు.