సికింద్రాబాద్ : కంటోన్మెంట్ బోర్డుకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచేందుకు మరో అడుగు ముందుకేసింది. కేంద్రం నుంచి రావాల్సిన బకాయిలు విడుదల కాకపోవడంతో నానాటికీ అభివృద్ధి కుంటుపడుతున్న నేపథ్యంలో రాష్ట్ర సర్కారు నుంచి సహకారం అందించాలని కోరుతూ సోమవారం కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్రెడ్డి నేతృత్వం లో మాజీ సభ్యులు పాండుయాదవ్, లోక్నాథం, నళినికిరణ్, ప్రభాకర్లు రాష్ట్ర అర్థికశాఖ మంత్రి హరీశ్రావును కలిశారు.
ఈ క్రమంలో ఇటీవలే వైద్య ఆరోగ్యశాఖ బాధ్యతలను స్వీకరించిన నేపథ్యంలో అభినందనలు తెలిపారు. అనంతరం కంటో న్మెంట్ బోర్డు పరిధిలో అభివృద్ధి పనుల్లో జాప్యం, నిధుల లేమితో పనులు పెండింగ్లో ఉన్న అంశాలను మంత్రి హరీశ్ రావు దృష్టికి తీసుకెళ్లారు. అదే విధంగా ప్రభుత్వం నుంచి టీపీటీ సర్వీస్ చార్జీలను విడుదల చేయాల్సిందిగా కోరారు.
దీనికి స్పందించిన మంత్రి హరీష్రావు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేస్తూ త్వరలోనే రూ.24కోట్లను కంటో న్మెంట్ బోర్డుకు విడుదల చేయాలని స్పష్టం చేశారు. ప్రభుత్వం కంటోన్మెంట్ బోర్డు అభివృద్ధికి వంద శాతం తోడ్పాటు నందిస్తుందని చెప్పారు.
ఈ సందర్బంగా బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్రెడ్డి మాట్లాడుతూ త్వరలోనే రూ24కోట్ల నిధులు కంటోన్మెంట్ బోర్డుకు జమకానున్నాయని, దీంతో ఆయా వార్డుల్లో పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులు పూర్తి కానున్నాయని చెప్పారు.
రాష్ట్ర ప్రభుత్వం బోర్డుకు ఇంత సహకరిస్తున్న కేంద్రం మాత్రం చోద్యం చూస్తుందని ఎద్దేవా చేశారు. మూడున్నరేళ్లుగా ఉపాధ్యక్షుడిగా పదవిలో ఉన్నా, ప్రస్తుతం బీజేపీలో కొనసాగుతున్న నేతలు కేంద్రం నుంచి ఒక్క రూపాయి తీసుకురాలేక పోయారని మండిపడ్డారు.
ఇప్పటికే పలు దఫాలుగా రాష్ట్ర ప్రభుత్వం నిధులు బోర్డుకు విడుదల చేస్తుందని, ఈ క్రమంలోనే త్వరలోనే మరిన్ని నిధులు విడుదల అవుతున్నాయని పేర్కొన్నారు. నిధుల విడుదలతో గతంలో ఎన్నడూ లేని విధంగా వార్డుల అభివృద్ధి చేసి చూపుతామని స్పష్టం చేశారు.