కవాడిగూడ : రోడ్డు నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అధికారు లను ఆదేశించారు. ఈ మేరకు బుధవారం భోలక్పూర్ డివిజన్లోని అలీ ఇబ్రహీం హోటల్ నుంచి నబీ హోటల్ వరకు రూ. 35 లక్షల వ్యయంతో వీడీసీ రోడ్డు నిర్మాణ పనులను ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా స్థానిక కార్పొరేటర్ గౌసొద్దీన్ తహ, కంటెస్టెడ్ కార్పొరేటర్ బింగి నవీన్కుమార్, జీహెచ్ఎంసీ డీఈ సన్నీ, ఏఈ తిరుపతిలతో కలిసి ఎమ్మెల్యే ముఠా గోపాల్ మాట్లాడుతూ డివిజన్లో రూ. 20 కోట్లతో శిధిలమైన మంచినీటి, డ్రైనేజీ పైప్లైన్లను తొలగించి నూతన పైప్లైన్ నిర్మాణ పనులు, కచ్చా నాళా, రోడ్ల నిర్మాణ పనులు చేపట్టి శాశ్వత సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టామని అన్నారు.
రోడ్ల నిర్మాణ పనుల్లో అధికారులు, కాంట్రాక్టర్లు నిర్లక్ష్యం చేయరాదని అన్నారు. త్వరితగతిన పూర్తి చేసి ప్రజల ఇబ్బందు లను తొలగించాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నగర విభాగం సీనియర్ నాయకుడు ముఠా జయసింహ, భోలక్పూర్ డివిజన్ ప్రధాన కార్యదర్శి మహ్మద్ సబీల్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.