ఆర్కేపురం : క్రమశిక్షణకు మారుపేరైన టీఆర్ఎస్ కార్యకర్తలు ఏ పదవి వచ్చినా స్వీకరించి పార్టీ నిర్మాణం కోసం చిత్తశుద్ధితో పనిచేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ఆర్కేపురం డివిజన్లో మంత్రి క్యాంపు కార్యాలయంలో డివిజన్ అధ్యక్షుడు పెండ్యాల నగేష్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ నాయకుల, కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
పార్టీకి పట్టుకొమ్మలే కార్యకర్తలేనని, ప్రతి కార్యకర్త కంటికి రెప్పలా చూసుకుంటామని తెలిపారు. డివిజన్ స్థాయిలో కష్టపడే కార్యకర్తలకు అవకాశం ఉంటుందన్నారు. డివిజన్ల వారీగా పార్టీ సంస్థాగత నిర్మాణం కోసం పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రతి డివిజన్లో సోషల్ మీడియా కమిటీ ఏర్పాటు చేసి ప్రభుత్వంపై, సీఎం కేసీఆర్పై ప్రతి పక్షాలు చేస్తున్న తప్పుడు ఆరోపణలు తిప్పికొట్టాలని సూచించారు. డివిజన్ల వారిగా బూత్ స్థాయి, బస్తీ కమిటీలను ఏర్పాటు చేస్తామని, అందుకు సంబంధించిన పేర్ల లిస్టు తయారు చేసి తనకు ఇవ్వాలని నాయకులకు సూచించారు.
సీఎం కేసీఆర్ ఉద్యమనాయకుడిగా పార్టీ పెట్టి రెండు సార్లు ముఖ్యమంత్రిగా గెలుపొంది రాష్ట్రన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు. పార్టీ సభ్యత్వం పెద్ద ఎత్తున చేపట్టారని, 63లక్షల పార్టీ సభ్యత్వాలున్న ఏకైక పార్టీ టీఆర్ఎస్ పార్టీ అని అన్నారు. మహిళా కమిటీలను ఏర్పాటు చేసి పురుషులతో పాటు మహిళలకు సమాన ప్రాధాన్యత ఉండేలా చూడాలని నాయకులకు సూచించారు. ప్రతి ఒక్కరూ పార్టీ నిర్ణయానికి కట్టుపడి పనిచేస్తూ ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాని చెప్పారు. ఈ కార్యక్రమంలో డివిజన్ మాజీ అధ్యక్షుడు మురుకుంట్ల అరవింద్శర్మ, డివిజన్ ఇన్చార్జ్ నెంటూరి రవీంద్రెడ్డి, నాయకులు మారోజు రామాచారి, న్యాలకొండ శ్రీనివాప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.