మారేడ్పల్లి : పేదింటి ఆడబిడ్డల పెండ్లీలకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు ఎంతో ఉపయోగపడుతున్నాయని కంటోన్మెంట్ ఎమ్మెల్యే జి. సాయన్న అన్నారు. బుధవారం కంటోన్మెంట్ ఐదవ వార్డు వాల్మీకినగర్, మోండా డివిజన్ రైల్నిలయం అంబేద్కర్నగర్ బస్తీలో కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే జి. సాయన్న మాట్లాడుతూ…పేదల సంక్షేమం, అభివృద్ధికోసం టీఆర్ఎస్ ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు. పేదింటి ఆడబిడ్డల పెండ్లిలకు ఆసరాగా ఉండాలనే సంకల్పంతోనే ఈ పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు.
లబ్ధిదారుల ఇండ్ల వద్దకు తానే నేరుగా వచ్చి ప్రభుత్వం అందజేస్తున్న పథకాలను అందించాలనే ఉద్దేశ్యంతో ముందుకొచ్చినట్లు స్పష్టం చేశారు. కంటోన్మెంట్ నియోజవకర్గంలో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన లబ్ధిదారులందరికీ అందిస్తున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు టిఎన్. శ్రీనివాస్, ముప్పిడి మధుకర్, పిట్ల నాగేష్ ముదిరాజ్, భాస్కర్, పెంటా శ్రీహరి, సదానంద్ గౌడ్, పెద్దాల నర్సింహ్మ, మాజీ కార్పొరేటర్ లాస్యనందిత తదితరులు పాల్గొన్నారు.