అబిడ్స్ : రంజాన్ సందర్భంగా శుక్రవారం ఎల్బీ స్టేడియంలో నిర్వహించనున్న ఇఫ్తార్ విందు ఏర్పాట్లను రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, హోం శాఖ మంత్రి మహమూద్ అలి, అధికారులతో కలిసి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ఆదేశాల మేరకు ప్రభుత్వం అన్ని పండుగలను నిర్వహిస్తోందన్నారు.
అన్ని మతాల వారు కలిసి ఉండేలా ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతోందని వివరించారు. ఈ సంవత్సరం కూడా శుక్రవారం నిర్వహించే ఇఫ్తార్ విందుకు భారీ ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఇఫ్తార్ విందుకు వచ్చే ప్రతినిధులకు ప్రత్యేక పాసులు జారీ చేయడం జరిగిందన్నారు. పేద ముస్లింలు పవిత్ర రంజాన్ను ఘనంగా జరుపుకోవాలని ప్రభుత్వం తరపున దుస్తులను పంపిణీ చేస్తున్నట్లు పేర్కొన్నారు.
రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలలో ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. శుక్రవారం నిర్వహించే ఇఫ్తార్ విందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరవుతున్న నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఎల్బీ స్టేడియం పరిసర ప్రాంతాలలో ఆరు ప్రాంతాలను గుర్తించి ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నట్లు వివరించారు.
మంత్రులతో పాటు ప్రభుత్వ సలహాదారు ఎకే ఖాన్, మైనార్టీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అహ్మద్ నదీమ్, డైరెక్టర్ షానవాజ్ ఖాసీం, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్కుమార్, ఐజీ రంగనాథ్, జాయింట్ కమిషనర్ డీఎస్ చౌహాన్, బీసీ కమిషన్ సభ్యులు కిషోర్ గౌడ్, మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్, జీహెచ్ఎంసీ సెంట్రల్ జోన్ జోనల్ కమిషనర్ రవికిరణ్, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ సయ్యద్ అక్బర్ హుస్సేన్, టీఆర్ఎస్ మైనార్టీ సెల్ రాష్ట్ర నాయకులు ఎంకె భద్రుద్దీన్, ఎం ఆనంద్కుమార్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.