మాదాపూర్ : ఈ నెల 25న మాదాపూర్లోని హైటెక్స్లో జరగనున్న టీఆర్ఎస్ ప్లీనరీ సభను దృష్టిలో ఉంచుకొని మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు కమిటీ సభ్యులు పనులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తు దిశానిర్ధేశాలు చేస్తున్నారు. ప్లీనరీ వేదిక లో తగిన ఏర్పాట్లు చేయడం కోసం వివిధ కమిటీల నాయకులు సమావేశ ప్రాంగణాన్ని సందర్శిస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే, విప్ అరెకపూడి గాంధీ, ఎమ్మెల్యే మాదవరం కృష్ణారావు, టీఎస్ఐఐసి చైర్మెన్ బాలమల్లు, సివిల్ సప్లై చైర్మెన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, కార్పొ రేటర్లు వి. జగదీశ్వర్గౌడ్, రాగం నాగేందర్ యాదవ్, ఉప్పలపాటి శ్రీకాంత్లతో పాటు ట్రాఫిక్ డీసీపీ విజయ్కుమార్, జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి బుధవారం ఏర్పాట్లను పరిశీలించారు.
ఇందులో భాగంగా మాదాపూర్లోని హైటెక్స్ ప్రాంగణంలో జరిగే సభ ప్రాంగణం వద్ద వేదిక, సభకు హజరుకానున్న వారి కొరకు పార్కింగ్ ఏర్పాట్లు, ట్రాఫిక్తో ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకునేలా ఏర్పాట్లను చేస్తున్నారు. నిర్ణీత సమయంలోపే సభకు సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేయాలని సంబంధిత ఇంచార్జీలకు పలు సూచనలు చేశారు. భద్రత, ట్రాఫిక్కు చెందిన అంశాలపై పోలీసులు అప్రమత్తంగా ఉంటూ చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులను కోరారు.
ఈ కార్యక్రమంలో మాదాపూర్ టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు ఎరగుడ్ల శ్రీనివాస్ యాదవ్, హఫీజ్పేట్ డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు బాలింగ్ గౌతమ్ గౌడ్, వాలా హరీష్రావు, శ్రీనివాస్ నాయక్, పార్టీ నాయకులు పాల్గొన్నారు.