ఎల్బీనగర్ : ఎల్బీనగర్ నియోజకవర్గాన్ని వరద నీటి నుండి పూర్తిస్థాయిలో విముక్తి కల్గించేందుకు రూ. 103.25 కోట్లతో వరదనీటి కాలువ నిర్మాణ పనులు త్వరలోనే ప్రారంభించనున్నారు. వరదనీటి కాలువల పనులను పూర్తిస్థాయిలో నిర్మాణం చేసి రాబోయే వర్షాకాలం నాటికి వరదనీటి చిక్కులకు పూర్తిస్థాయిలో చెక్ పెట్టేందుకు సిద్దం అవుతున్నారు.
ఈ మేరకు ఎల్నీనగర్ నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలో సమగ్ర నాలా అభివృద్ది కార్యాక్రమం ( ఎస్ఎన్డీపీ)లో భాగంగా గతంలోనే రుపొందించిన ప్రణాళికాలకు అనుగుణంగా చేపట్టే పనులపై చీప్ ఇంజనీర్తో పాటుగా ఇంజనీరింగ్ అధికారులతో ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ ఛైర్మన్ దేవిరెడ్డి సుధీర్రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎస్ఎన్డీపీ పనుల పురోగతిపై ఎమ్మెల్యే చర్చించారు. ఈ సందర్భంగా దేవిరెడ్డి సుధీర్రెడ్డి మాట్లాడుతూ ఎల్బీనగర్ నియోజకవర్గంలో రూ. 103.25 కోట్లతో చేపట్టనున్న వరదనీటి కాలువ నిర్మాణం పనులు ప్రారంభం అయ్యేందుకు అంతా సిద్దం అయ్యిందన్నారు.
వర్షాకాలంలో వరదలకు నియోజకవర్గంలోని కాలనీలు మునగకుండా రాబోయే వర్షాకాలంలోపే వరదనీటి కాలువల నిర్మాణాలు పూర్తికావాలని కోరడం జరిగిందన్నారు. వరదనీటి కాలువ పనులు పూర్తయితే అన్ని కాలనీలు నీటి ముంపు నుండి గట్టెక్కుతాయన్నారు.
ఎల్బీనగర్ నియోజకవర్గంలో మన్సూరాబాద్ చిన్న చెరువు నుండి బండ్లగూడ వరకు, బండ్లగూడ చెరువు నుండి మూసీ నది వరకు, హయత్నగర్ బాతుల చెరువు నుండి ఇంజాపూర్ వరకు, చంపాపేట చంద్రాగార్డెన్స్ నుండి సరూర్నగర్ చెరువు వరకు, వంగ శంకరమ్మ గార్డెన్స్ నుండి సరూర్నగర్ చెరువు వరకు కాలువ నిర్మించాలన్నారు.
సరూర్నగర్ చెరువు నుండి జీహెచ్ఎంసీ జోనల్ కార్యాలయం మీదుగా చైతన్యపురి కళానికేతన్ వద్ద మూసీ నాలాలోకి , సరూర్నగర్ చెరువు నుండి కోదండరాంనగర్ మీదుగా చైతన్యపురి మూసీ నాలా వరకు వరదనీరు పోయే విధంగా ప్రణాళికలు సిద్దం చేయడం జరిగిందన్నారు.
ఈ కార్యక్రమంలో లేక్స్ ఎస్ఇ మురళి కృష్ణ, జీహెచ్ఎంసీ నాలా డెవలప్మెంట్ ప్రొగ్రాం ఎస్ఇ భాస్కర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.