కాచిగూడ : హూజూరాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి తెలంగాణ ఉద్యమకారుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్కు పలు బీసీ కుల, విద్యార్థి సంఘాలు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించాయి. ఆదివారం కాచిగూడలో యాదవ, ముది రాజ్, రజక, మేదరి, విద్యార్థి, బీసీ టీచర్ల సంఘాల నాయకులు మాట్లాడుతూ అంబర్పేట నియోజకవర్గంలోని 25 హస్టల్స్ నుంచి వందలాది మంది బీసీ నాయకులు, విద్యార్థులు గెల్లు శ్రీనివాస్ తరుపున ప్రచారానికి 45 వాహనాల్లో హుజూరాబాద్ కు బయలుదేరి వెళ్లారు.
బీసీ, విద్యార్థి సంఘాల అభ్యర్థన మేరకు సీఎం కేసీఆర్ స్పందించి హూజూరాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ ఉద్యమకారుడు, బీసీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్కు ఇవ్వడం పట్ల పలు బీసీ సంఘాలు కేసీఆర్కు కృతజ్ఞతలు తెలియజేశాయి. హూజూరాబాద్లో ఓట్లు చీలకుండా బీసీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ను భారీ మెజారిటీతో గెలిపించి బీసీల సంఘటిత శక్తిని నిరుపించాలని పిలుపునిచ్చారు.
రాజకీయాలకు అతీతంగా హూజూరాబాద్లో బీసీ అభ్యర్థిని గెలిపించుకుంటే రాబోయే రోజుల్లో ప్రధాన రాజకీయ పార్టీలు బీసీల సంఘటిత శక్తిని చూసి బీసీలకు అధిక శాతం టికెట్లు ఇచ్చే అవకాశం ఉంటుందన్నారు. హూజూరాబాద్ ఉప ఎన్నికల ప్రచారంలో గెల్లు శ్రీనివాస్ తరుపున పాల్గొని అత్యంత మెజారిటితో గెలిపిస్తామన్నారు.
హూజూరాబాద్ ప్రజల ఆదరణ చూస్తుంటే టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ అత్యధిక మెజారిటీతో గెలుపొందడం ఖాయమని పేర్కొన్నాయి. ఈ ఉప ఎన్నికల్లో బీజేపీ,కాంగ్రెస్ పార్టీలను చిత్తుగా ఓడించి, టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెల్లును గెలిపించి, బీసీల సంఘటిత శక్తిని నిరూపించాలని పిలుపునిచ్చాయి.