చిక్కడపల్లి : మత్స్యకారులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉందని రాజ్యసభ సభ్యుడు బండా ప్రకాశ్ అన్నారు. దేశంలో మత్స్యకారుల సంక్షేమానికి వెయ్యికోట్ల బడ్జెట్ కేటాయించిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుందన్నారు. తెలంగాణ మత్స్యకారులు, మత్స్య కార్మిక సంఘం 20 వార్షికోత్సవం సందర్భంగా శనివారం సాయంత్రం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మత్స్యకార సాంస్కృతిక సంబురాలను నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ బండా ప్రకాశ్ మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మత్స్యకారుల బడ్జెట్ కేవలం కోటి రూపాయిలు ఉండేదని, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం టీఆర్ఎస్ ప్రభుత్వం వెయ్యికోట్లు కేటాయించిందన్నారు.6 లక్షల రూపాయిల ఎక్స్గ్రేషియాను అందిస్తుందన్నారు.
దేశంలో ఉచితంగా చేప పిల్లలు, రొయ్యల పంపిణీ చేస్తున్న ఎకైక ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎక్కడా లేని విధంగా జీ.ఓ.268 ద్వారా చెరువుల కుంటలపై మత్స్యకారులకు హక్కులు కల్పిచారని వివరించారు.
ఒక్కొ కమ్యూనిటీ హాళ్ల నిర్మాణం కోసం 10 లక్షల రూపాయిలు ప్రభుత్వం అందించడం జరిగిందని.ఈ విధంగా 750 కమ్యూనిటీ హాళ్లు నిర్మించడం జరిగిందని వివరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్కు మత్స్యకారుల సమస్యలపై అవగాహన ఉందని అన్నారు. తన దృష్టికి తీసుకొచ్చిన సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు.
ఎమ్మెల్యే ముఠా గోపాల్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ మిషన్ కాకతీయ పథకం ద్వారా 46వేల చెరువులకు జల కళ తెచ్చారని అన్నారు. సంఘం జాతీయ కార్యదర్శి లెల్లల బాలకృష్ణ, నాయకులు గోరెంకల నర్సింహ, శ్రీరాములు, కొప్పు పద్మ, లలిత, శంకర్, విజయ్కుమార్, నాగమణి, ముఠా దశరథ్, అమరావతి, సత్యవతి, జగదీశ్, కనకతార వెంకన్న, మనోజ్సింగ్ తదితరులు పాల్గొన్నారు.