కొండాపూర్ : జాతిపిత మహాత్మా గాంధీ సిద్ధాంతాలను, ఆశయాలను ఆచారించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని తెలంగాణ శాసన మండలి సభ్యురాలు, ప్రముఖ విద్యావేత్త సురభి వాణీదేవి అన్నారు. గాంధీ జయంతిని పురస్కరించు కుని మాదాపూర్లోని శిల్పారామంలో మహాత్మా గాంధీ జీవిత విశేషాలపై కేంద్ర సమాచార, ప్రసార శాఖ ఆధ్వర్యంలో రీజినల్ ఔట్ రీచ్ బ్యూరో (ఆర్ఓబీ) నిర్వహిస్తున్న ఫోటో ప్రదర్శనను ఆమె ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.
అనంతరం వాణీదేవి మాట్లాడుతూ గాంధీజీ అనుసరించిన, అభిలాషించిన సత్యం, అహింస, స్వచ్ఛత, మహిళల అభ్యున్నతి, స్వయం పాలన వంటి సిద్ధాంతాలను నేటి తరం తెలుసుకుని ఆచరించాలన్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవాలలో భాగంగా గాంధీ జయంతి ఉత్సవాలను ఘనంగా జరుపుకునేందుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు.
అనంతరం గాంధీజీ జీవిత ఇతివృత్తాన్ని కళాకారులు ‘గాంధీ మార్గం’ పేరిట ప్రదర్శించిన నాటకాన్ని ఎమ్మెల్సీ వాణీదేవి తిలకించారు. గాంధీజీ ఫోటో ప్రదర్శన మూడు రోజుల పాటు కొనసాగనున్నట్లు నిర్వహకులు తెలిపారు.