శంషాబాద్ : సీఎం కేసీఆర్ దంపతులు సోమవారం రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ముచ్చింతల్ పరిధిలోని శ్రీ రామనగరంలో ప్రముఖ ఆధ్యాత్మిక గురువు త్రిదండి చినజీయర్ స్వామి ఆశ్రమానికి వెళ్లారు. ముఖ్యమంత్రికి వేద పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు.
శంషాబాద్, ముచ్చింతల్లోని ఆశ్రమానికి సతీ సమేతంగా వెళ్లిన కేసీఆర్… చినజీయర్ స్వామి ఆశీస్సులు తీసు కున్నారు. కాగా యాదాద్రి ఆలయ ప్రారంభోత్సవం పై చినజీయర్ స్వామితో సీఎం చర్చించారు. దసరా నాటికి ఆలయాన్ని ప్రారంభిస్తామని సీఎం గతంలో ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే చినజీయర్ తో ప్రత్యేకంగా భేటి అయిన సీఎం ప్రారంభతేదీపై మాట్లాడినట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉండగా రామానుజ సహస్రాబ్ది ఉత్సవం సందర్భంగా వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రధానమంత్రి నరేంద్రమోడి చేతుల మీదుగా ప్రారంభించనున్న సమతామూర్తి విగ్రహ ప్రతిష్టాపన అంశంపై కూడ చర్చించినట్లు సమాచారం. ఈ కార్యక్రమంలో ఎంపీ జోగినిపల్లి సంతోష్కుమార్, మై హోం గ్రూప్ సంస్థల అధినేత డాక్టర్ జూపల్లి రామేశ్వరరావు పాల్గొన్నారు.