ఉస్మానియా యూనివర్సిటీ : ఉస్మానియా యూనివర్సిటీలో సుదీర్ఘ కాలంగా పనిచేస్తున్న సెక్యూరిటీ కార్మికులను తొలగించడంతో, వారంతా తమను తిరిగి తీసుకోవాలని గత కొంతకాలంగా ఆందోళన కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో వారు ఆర్ట్స్ కళాశాల ఆవరణలో భిక్షాటన నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 300 మంది కార్మికులు యూనివర్సిటీలో సెక్యూరిటీ గార్డులుగా పనిచేస్తున్నారని, కేవలం రూ.1,500 జీతంతో దాదాపు ఇరవై ఏండ్లుగా సేవలిందించాలని తెలిపారు. అనేక పోరాటాల ఫలితంగా గత మూడు ఏండ్లుగా రూ.6,000 వేతనం చెల్లిస్తున్నారన్నారు. కనీస వేతనాన్ని కూడా తమకు చెల్లించకుండా పని చేయించుకున్నారని ఆరోపించారు.
కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లోనూ తాము పనిచేశామని అన్నారు. అటువంటి తమను ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా తొలగించడమేమిటని ప్రశ్నించారు. అధికారుల చర్యతో తామంతా రోడ్డున పడ్డామని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే అందిరినీ విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సెక్యూరిటీ గార్డులు నాన్లోకల్ గోబ్యాక్ అంటూ నినదించారు.