అధికారులకు ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ఆదేశం
పుష్కర ఘాట్ల పరిశీలన
చెన్నూర్లో స్వయం సహాయ సంఘాలకు రుణాలు అందజేత
కోటపల్లి, డిసెంబర్ 29 : ప్రాణహిత పుష్కరాలకు ఏర్పాట్ల పనులను వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను ప్రభుత్వ విప్, చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆదేశించారు. వచ్చే ఏడాది ఏప్రిల్లో జరగనున్న ప్రాణహిత ఏర్పాట్లలో భాగంగా కోటపల్లి మండలంలోని అర్జునగుట్ట, రాపనపల్లి గ్రామం సమీపంలోని ప్రాణహిత నది తీరాన్ని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ బుధవారం సాయంత్రం పరిశీలించారు. పుష్కరాల ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు రాష్ట్ర మంత్రులు, వీఐపీలు వచ్చే అవకాశం ఉన్నందున ఇప్పటినుంచే పుష్కరాల నిర్వహణకు ఏర్పాట్ల పనులు ప్రారంభించాలని ఆదేశించారు. రాపనపల్లి సమీపంలోని అంతర్రాష్ట్ర వంతెన వద్ద రెండు ఘాట్లు, అర్జునగుట్టసమీపంలోని మరో ఘాట్ను ఏర్పాటు చేయాలని విప్ సూచించారు. అనంతరం దేవులవాడ సమీపంలోని ప్రాణహిత నదిని సందర్శించి సూచనలు చేశారు. త్వరలో దేవాదాయ శాఖ, ఆర్ అండ్బీ, పంచాయితీ రాజ్ శాఖ, విద్యుత్ తదితర శాఖ అధికారులతో సమీక్షా సమా వేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మంత్రి సురేఖ, వైస్ ఎంపీపీ వాల శ్రీనివాస్రావు, జడ్పీ కోఆప్షన్ సభ్యులు అజ్గర్ మొహియొద్దీన్, రైతుబంధు సమితి మండల కన్వీనర్ గుర్రం రాజన్న, పీఏసీఎస్ చైర్మన్ పెద్దపోలు సాంబాగౌడ్, మాజీ ఏఎంసీ చైర్మన్ మూల రాజిరెడ్డి, వైస్ చైర్మన్ ఎరినాగుల ఓదెలు, టీఆర్ఎస్ యూత్ మండల అధ్యక్షుడు మారిశెట్టి విద్యాసాగర్, సర్పంచ్లు గుర్రం లక్ష్మీ, పానెం శంకర్, గోనె సత్యనారాయణ, పెద్దింటి పున్నంచంద్, తహసీల్దార్ గోవింద్ నాయక్, ఎంపీవో ముల్కల్ల సత్యనారాయణ, పీఆర్ ఏఈ రాజశేఖర్, పంచాయతీ కార్యదర్శి కమల్, నాయకులు పిల్లి సమ్మయ్య, పడాల శ్రీనివాస్, ఆసంపల్లి సంపత్ తదితరులు పాల్గొన్నారు.
మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించాలి
చెన్నూర్, డిసెంబర్ 28: రుణాలను సద్వినియోగం చేసుకొని, ఆర్థికంగా అభివృద్ధి చెందాలని వాలని స్వయం సహాయక సంఘాల మహిళలకు ప్రభుత్వ విప్ బాల్క సుమన్ సూచించారు. చెన్నూర్లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నియోజకవర్గంలోని 246 స్వయం సహాయక సంఘాలకు రూ.12 కోట్లు రుణాలు మంజూరయ్యాయి. ఇందుకు సంబంధించిన చెక్కులను సభ్యులకు బుధవారం ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో 33 వేల మంది స్వయం సహాయక సంఘాల సభ్యుల ఆర్థిక ప్రగతి కోసం శిక్షణ తరగతులను నిర్వహించనున్నట్టు వెల్లడించారు. నియోజకవర్గంలోని 102గ్రామాల్లో స్వయం సహాయక సంఘాల కోసం రూ 15 లక్షల వ్యయంతో సమ్మక్క – సారలక్క పేరుతో మహిళా సంఘం భవనాలను నిర్మించనున్నట్టు వెల్లడించారు. మొదటి విడుతగా చెన్నూర్ మండలంలో 9 గ్రామాల్లో, కోటపల్లి మండలంలో 9గ్రామాల్లో, భీమారం మండలంలో 5గ్రామాల్లో, జైపూర్ మండలంలో 6 గ్రామాల్లో, మందమర్రి మండలంలో 5 గ్రామాల్లో భవనాలను నిర్మిస్తున్నట్టు వివరించారు. నియోజకవర్గంలోని మందమర్రి, క్యాతన్పల్లి మున్సిపాలిటీల్లో రూ.2కోట్లతో మహిళా సంఘం భవనాలను నిర్మిస్తున్నట్టు తెలిపారు. రెండో విడుతలో ఏప్రిల్ వరకు మరో 65 గ్రామాలతో పాటుగా చెన్నూర్ మున్సిపాలిటీలో మహిళా సంఘం భవనాలను నిర్మించనున్నట్టు తెలిపారు. మూడో విడుతలో అన్ని గ్రామాల్లో నిర్మిస్తామని తెలిపారు. నియోజకవర్గంలోని మహిళా సంఘాలకు రూ. 77.30 కోట్ల రుణాలకు గాను రూ.70కోట్లను అందించినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీవో శేషాద్రి, ఐకేపీ ఏపీడీ శ్రీనివాస్, నియోజకవర్గంలోని జడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, పాల్గొన్నారు.
చెన్నూర్ పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా
చెన్నూర్ పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నట్టు ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అన్నారు. చెన్నూర్ మున్సిపల్ సాధారణ సర్వసభ్య సమావేశం మున్సిపల్ చైర్ పర్సన్ అర్చనా గిల్డా అధ్యక్షతన బుధవారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ప్రభుత్వ విప్ బాల్క సుమన్ హాజరై మాట్లాడారు. చెన్నూర్ పట్టణంలోని జలాల్ పెట్రోల్ పంపు నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు గల ప్రధాన రహదారి విస్తరణ, డివైడర్, సెంట్రల్ లైటింగ్ సిస్టం, సైడ్ డ్రైన్ నిర్మాణం, ప్రధాన కూడళ్ల సుందరీకరణ పనులు చేపడుతున్నామని తెలిపారు. పెద్ద చెరువు, కుమ్మరి కుంటపై మినీ ట్యాంక్ బండ్ నిర్మాణ పనులు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. రూ.9కోట్లతో అధునాతనంగా ప్రభుత్వ దవాఖాన భవనాన్ని నిర్మిస్తున్నట్టు తెలిపారు. యువత కోసం అంబేద్కర్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను, కేసీఆర్ పార్కును నిర్మిస్తున్నట్టు చెప్పారు. కొద్ది నెలల్లోనే పనులు పూర్తయి అందుబాటులోకి రానున్నాయని తెలిపారు. త్వరలోనే పట్టణంలోని పలు వార్డుల్లో సిమెంటు రోడ్లు, స్రెడ్ డ్రైన్ల నిర్మాణాలను చేపట్టనున్నట్టు చెప్పారు. పాలక వర్గం సభ్యులు పరస్పరం సహకరించుకుంటూ అభివృద్ధిలో ముందుకు సాగాలని తెలిపారు. సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. మిషన్ భగీరథ పనులను త్వరలో పూర్తి చేసి పట్టణ ప్రజలకు తాగు నీరు అందించాలని, విద్యుత్ సరఫరా సమస్యలు వెంటనే పరిష్కరించాలన్నారు. అనంతరం మున్సిపాలిటీ పారిశుధ్య సిబ్బందికి ప్రోత్సాహక బహుమతులను పంపిణీ చేశారు. ఈ సమావేశంలో మున్సిపాలిటీ వైస్ చైర్మన్ నవాజొద్దీన్, కమిషనర్ ఖాజా మొయినొద్దీన్, కౌన్సిలర్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.