Power Cuts | హైదరాబాద్, మే 4 (నమస్తే తెలంగాణ): విద్యుత్ సరఫరాలో తరచూ ఏర్పడుతున్న అంతరాయాల వల్ల పరిశ్రమలకు తీవ్ర నష్టం వాటిల్లుతున్నది. ముఖ్యంగా నిరంతరం ప్రాసెసింగ్ ఉండే ప్లాస్టిక్, అల్యూమినియం ఉత్పత్తులకు సంబంధించిన పరిశ్రమల్లో స్క్రాప్ అంతకంతకు పెరిగిపోతున్నది. అకస్మాత్తుగా కరెంటు పోతుండటం వల్ల ఎంసీబీలు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు పాడవుతున్నాయి.
కరెంటు ఎప్పుడు పోతుందో, ఎంతసేపు పోతుందో తెలియక వ్యాపారవేత్తల ఆందోళనకు గురవుతున్నాయి. ఇప్పటికే ఒకవైపు ఖర్చులు పెరిగి ఇబ్బందులు ఎదుర్కొంటున్న పారిశ్రామికవేత్తలపై కరెంట్ రూపంలో షాక్ తగులుతున్నది. రాష్ట్రంలో అధికారికంగా విద్యుత్ కోతలు లేకపోయినప్పటికీ పలు కారణాలతో తరుచూ విద్యుత్ సరఫరాలో అంతరాయాలు ఏర్పడుతున్నాయి.
సహజంగా ఉత్పత్తి పూర్తయ్యేవరకు విద్యుత్ నిరంతరంగా సరఫరా అయితే ఉత్పత్తులు నాణ్యమైనవి కాకుండా ఖర్చులు కూడా కలిసిరానున్నాయి. అనధికార కోతలతో తరుచుగా చిన్న స్థాయి పరిశ్రమల యంత్రాలు నిలిచిపోతుండటంతో నాణ్యత దెబ్బతినడంతోపాటు స్క్రాప్ పెరిగిపోయింది.
ముఖ్యంగా చర్లపల్లి, బాలానగర్, జీడిమెట్ల, నాచారం, మల్లాపూర్ తదితర పారిశ్రామికవాడల్లో రోజూ నాలుగైదుసార్లు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతున్నది. దీనివల్ల ముఖ్యంగా నిరంతరం ప్రాసెసింగ్ ఉండే పరిశ్రమలపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతున్నది. ప్లాస్టిక్, అల్యూమినియం పరిశ్రమల్లో నిరంతరం ప్రాసెసింగ్ ఉంటుంది.
రాష్ట్ర ప్రగతిపై ప్రతికూల ప్రభావం..
కేసీఆర్ హయాంలో పరిశ్రమలకు రెప్పపాటు కూడా కరెంటు పోయిన దాఖలాలు లేవు. దీంతో గతంలో జనరేటర్లన్నీ మూలనపడ్డాయి. మళ్లీ కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి విద్యుత్ కష్టాలు మళ్లీ ఆరంభమయ్యాయి. దీంతో మూలనపడిన జనరేటర్లు తిరిగి ప్రారంభంకాబోతున్నాయి. గతంలో నిరంతర విద్యుత్ సరఫరాకు తెలంగాణ రాష్ట్రం కేరాఫ్గా మారిందనే విషయం ప్రపంచవాప్తంగా పరిశ్రమవర్గాల్లో ప్రధాన చర్చనీయాంశంగా ఉండేది.
ఈ నేపథ్యంలో ఇప్పుడు జరుగుతున్న విద్యుత్ అంతరాయాలు రాష్ట్ర కీర్తిని మసకబారుస్తున్నాయనే విమర్శలకు తావిస్తున్నది. విద్యుత్ అంతరాయం ఐదు నుంచి పది నిమిషాలపాటు ఉంటున్నదని, ఇలా రోజులో నాలుగైదు సార్లు జరుగుతున్నదని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.
దీనివల్ల ఇంతకాలం నిరంతర విద్యుత్కు పేరుగాంచిన తెలంగాణ ఇమేజ్ దెబ్బతినే ప్రమాదం ఉందని వారు పేర్కొంటున్నారు. విద్యుత్ కోతలు మొదలైతే మళ్లీ తెలంగాణ ఏర్పాటుకు ముందున్న పరిస్థితులే పునరావృతమవుతాయని వారు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ప్రభుత్వం విద్యుత్ అంతరాయాల నివారణకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
తగిలిన వేసవి ‘సెగ’!
రాష్ట్రంలోని పరిశ్రమలకు వేసవి సెగ గట్టిగానే తగిలింది. రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు 46 డిగ్రీల వరకు చేరడంతో పరిశ్రమల్లో పనులకు వెళ్లేందుకు కార్మికులు జంకుతున్నారు. వేడికితోడు పరిశ్రమల్లో బాయిలర్ల వేడికి కార్మికులు తట్టుకోలేకపోతుండటంతో చాలా వరకు పరిశ్రమలు మధ్యాహ్నం 12 గంటల నుంచి నాలుగు గంటల వరకు నిలిపివేస్తున్నారు.
పరిశ్రమల్లో సహజంగా రెండు, మూడు షిప్టుల్లో కార్మికులు విధులు నిర్వహిస్తుంటారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ ఏడాది గరిష్ఠ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో కార్మికుల ఆరోగ్యంపై తీవ్రస్థాయిలో ప్రభావం చూపుతున్నదని.. ముఖ్యంగా మధ్యాహ్న సమయంలో వడగాలులు, వేడి వల్ల పనులు చేయలేకపోతున్నట్లు కార్మికులు చెబుతున్నారు.