భీమ్గల్, మే 4: హామీలతో ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్, బీజేపీలకు పార్లమెంట్ ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం ఆయన నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలం బెజ్జోర, పిప్రి గ్రామాల్లో బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్కు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా చేపట్టిన రోడ్షోలో వేముల మాట్లాడుతూ.. అధికారంలోకి వస్తే వందరోజుల్లో ఆరు గ్యారెంటీలను అమలుచేస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ.. ఇచ్చిన హామీలను మరిచిపోయిందని మండిపడ్డారు.
ప్రభుత్వం ఏర్పడి ఐదునెలలైనా హామీలు అమలుకు నోచుకోవడంలేదని విమర్శించారు. ప్రజలను మభ్యపెడుతూ ఐదు నెలలు గడిపారని ఆరోపించారు. మోసం చేసిన రేవంత్ సర్కార్కు ఓటుతో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఏ ఒక్కరోజు కూడా ప్రజల మధ్యకురాని బీజేపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ ఓట్ల కోసం మరోసారి రావడం సిగ్గుచేటని అన్నారు. కేసీఆరే తెలంగాణకు శ్రీరామరక్ష అని పేర్కొన్నారు. ప్రశ్నించే గొంతుక బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.