రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) జూలు విదిల్చింది. సీజన్ ప్రథమార్ధంలో వరుస ఓటములతో కుదేలైన బెంగళూరు..కీలకమైన ద్వితీయార్ధంలో అదరగొడుతున్నది. ప్లేఆఫ్స్ బెర్తు దక్కించుకోవాలన్న కసితో ఉన్న ఆర్సీబీ..ఎదురైన ప్రత్యర్థినల్లా చిత్తుచేస్తూ ముందుకు సాగుతున్నది. చిన్నస్వామి స్టేడియంలో ఆసక్తికరంగా సాగిన పోరులో గుజరాత్ టైటాన్స్ను చిత్తుచేస్తూ హ్యాట్రిక్ విజయాలను ఖాతాలో వేసుకుంది. సిరాజ్, దయాల్, వైశాక్ విజృంభణతో గుజరాత్ను స్వల్ప స్కోరుకే కట్టడి చేసిన ఆర్సీబీ..డుప్లెసిస్, విరాట్ కోహ్లీ బ్యాటింగ్తో కచ్చితంగా గెలువాల్సిన మ్యాచ్లో సత్తాచాటింది. ఫలితంగా నాలుగో విజయంతో ఏడో స్థానానికి ఎగబాకింది.
RCB | బెంగళూరు: ఐపీఎల్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వరుస విజయాల జోరు కొనసాగుతున్నది. ప్లేఆఫ్స్ రేసులో నిలువాలంటే ప్రతీ మ్యాచ్ కీలకమైన తరుణంలో ఆర్సీబీ ప్రాణాలు పెట్టి పోరాడుతున్నది. శనివారం జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ 4 వికెట్ల తేడాతో(38 బంతులు మిగిలుండగానే) గుజరాత్పై ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. తొలుత సిరాజ్(2/29), యశ్ దయాల్(2/21), విజయ్కుమార్ వైశాక్(2/23) ధాటికి గుజరాత్ 19.3 ఓవర్లలో 147 పరుగులకు పరిమితమైంది. ఓపెనర్లు సాహా(1), శుభ్మన్గిల్(2) సింగిల్ డిజిట్ స్కోర్లకే వెనుదిరిగారు.
షారుఖ్ఖాన్(37), రాహుల్ తెవాటియా(35) జట్టును ఆదుకున్నారు. ఆ తర్వాత లక్ష్యఛేదనకు దిగిన బెంగళూరు 13.4 ఓవర్లలో 152/6 స్కోరు చేసింది. డుప్లెసిస్(23 బంతుల్లో 64, 10ఫోర్లు, 3 సిక్స్లు), కోహ్లీ(42) రాణించారు. అయితే జోష్ లిటిల్(4/45) ధాటికి ఒక దశలో ఆర్సీబీ 117 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయింది. ఆఖర్లో దినేశ్ కార్తీక్(21 నాటౌట్), స్వప్నిల్ సింగ్(15 నాటౌట్) జట్టును గెలుపు తీరాలకు చేర్చారు. తన స్వింగ్ బౌలింగ్తో గుజరాత్ను కట్టడి చేయడంలో కీలకమైన సిరాజ్కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది. వరుసగా మూడో ఓటమితో గుజరాత్ తొమ్మిదో స్థానానికి పడిపోయి ప్లేఆఫ్స్ అవకాశాలను మరింత క్లిష్టం చేసుకుంది.
డుప్లెసిస్, కోహ్లీ విజృంభణ:
స్వల్ప లక్ష్యఛేదనలో ఆర్సీబీకి అదిరిపోయే ఆరంభం దక్కింది. మోహిత్శర్మ ఇన్నింగ్స్ తొలి ఓవర్లో కోహ్లీ రెండు భారీ సిక్స్లతో 14 పరుగులు వస్తే…లిటిల్ రెండో ఓవర్లో డుప్లెసిస్ సిక్స్, మూడు ఫోర్లతో 20 పరుగులు పిండుకున్నాడు. మోహిత్ను మరోమారు అరుసుకుంటూ డుప్లెసిస్ నాలుగు ఫోర్లతో విజృంభించడంతో 18 పరుగులు వచ్చిపడ్డాయి. ఈ క్రమంలో 18 బంతుల్లో అర్ధసెంచరీ మార్క్ అందుకున్న డుప్లెసిస్ను లిటిల్ ఔట్ చేశాడు. అయితే లిటిల్ ధాటికి 18 పరుగుల తేడాతో జాక్స్(1), పాటిదార్(2), మ్యాక్స్వెల్(4), గ్రీన్(1) ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. ఓటమి కోరల్లో చిక్కుకున్న ఆర్సీబీని..స్వప్నిల్తో కలిసి కార్తీక్ ఒడ్డున పడేశాడు.
ఆర్సీబీ బౌలర్లు అదుర్స్
మొదట టాస్ గెలిచిన ఆర్సీబీ కెప్టెన్ డుప్లెసిస్..గుజరాత్ను బ్యాటింగ్కు ఆహ్వానించాడు. కెప్టెన్ నమ్మకాన్ని నిలబడుతూ సిరాజ్ తన తొలి ఓవర్లోనే సాహాను ఔట్ చేసి వికెట్ల పతనానికి నాంది పలికాడు. ఆ తర్వాత తిరిగి బౌలింగ్కు వచ్చిన సిరాజ్ ఈసారి గిల్ పనిపట్టాడు. సిరాజ్ బంతిని సరిగ్గా అర్థం చేసుకోని గిల్..విజయ్కుమార్కు క్యాచ్ ఇచ్చి రెండో వికెట్గా వెనుదిరిగాడు.
బౌలింగ్ మార్పుగా వచ్చిన గ్రీన్..సుదర్శన్(6)ను మూడో వికెట్గా పెవిలియన్ పంపాడు. దీంతో పవర్ప్లే ముగిసే సరికి టైటాన్స్ 23 పరుగులకు 3 వికెట్లు కోల్పోయింది. ఈ సీజన్లో అత్యల్ప ప్లేఆఫ్స్ స్కోరుగా ఇది నమోదైంది. ఈ దశలో మిల్లర్, షారుఖ్ఖాన్ ఇన్నింగ్స్ను చక్కదిద్దారు. వీరిద్దరు కలిసి బెంగళూరు బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ స్కోరుబోర్డుకు కీలక పరుగులు జతచేశారు. అయితే ఏడు పరుగుల తేడాతో వీరిద్దరు ఔట్ కావడంతో గుజరాత్కు మళ్లీ కష్టాలు ఎదురయ్యాయి. ఆఖర్లో తెవాటియా, రషీద్ఖాన్(18), శంకర్(10)కీలక పరుగులు జతకలిపారు.
సంక్షిప్త స్కోర్లు
గుజరాత్: 19.3 ఓవర్లలో 147 ఆలౌట్ (షారుఖ్ 37, తెవాటియా 35, సిరాజ్ 2/29, దయాల్ 2/21),
బెంగళూరు: 13.4 ఓవర్లలో 152/6(డుప్లెసిస్ 64, కోహ్లీ 42, లిటిల్ 4/45, నూర్ అహ్మద్ 2/23)