నిర్మల్ టౌన్, జూన్ 9 : ఎస్సీ కార్పొరేషన్ ద్వారా వృత్తి నైపుణ్యం, స్వయం ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా గ్రామీణాభివృద్ధిశాఖ అధికారి వెంకటేశ్వర్లు అన్నారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా స్వయం ఉపాధి శిక్షణ కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు జిల్లా కేంద్రంలోని ఇంద్రానగర్ సాంఘిక సంక్షేమ బాలుర కళాశాలలో గురువారం ఇంటర్వ్యూలు నిర్వహించారు. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు వివిధ రంగాల్లో వృత్తి నైపుణ్య శిక్షణతో పాటు సబ్సిడీ రుణాలు అందిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో లీడ్ బ్యాంకు మేనేజర్ హరికృష్ణ, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ హన్మండ్లు, సాంఘిక సంక్షేమ అభివృద్ధి అధికారి సుదర్శన్గౌడ్, పరిశ్రమలశాఖ అధికారి నర్సింహారెడ్డి, అధికారులుమణిశ్వర్,ప్రసాద్, లక్ష్మయ్య పాల్గొన్నారు.
ఇంటర్వ్యూలకు హాజరు కావాలి
ఎదులాపురం,జూన్ 9: ఎస్సీ కార్పొరేషన్ రుణాలకు దరఖాస్తు చేసుకున్న వారికి కేటాయించిన తేదీల్లో ఇంటర్వ్యూలకు హాజరు కాని అభ్యర్థులకు గురు,శుక్రవారాల్లో మరోసారి అవకాశం కల్పిస్తున్నామని ఈడీ శంకర్ అన్నారు. బేల, ఇచ్చోడ, తాంసి మండల అభ్యర్థులకు బుధవారం ఇంటర్వ్యూలు నిర్వహించారు. మూడు మండలాల నుంచి 220 మంది దరఖాస్తు చేసుకోగా, 132 మంది హాజరయ్యారు. వారి సర్టిఫికెట్లను అధికారులు పరిశీలించారు. వాహనాల యూనిట్ల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేశారు. అధికారులు ఎల్డీఎం చంద్రశేఖర్, డీఐసీ జీఎం పద్మభూషణ్ రాజ్ , ఏఎంవీఐ సాయిచరణ్, డీఎస్సీడీవో,ఎస్సీ కార్పొరేషన్ ఈవో భాగత్ సునీత పాల్గొన్నారు.