బీ ఫామ్ కోసం ఆశావహుల యత్నాలు ముమ్మరం
ఒకరి కంటే ఎక్కువగా ఉన్న వార్డుల్లో మిగతావారిని బుజ్జగించే ప్రయత్నాలు
కలిసి పనిచేయాలని.. కష్టపడిన వారందరికీ గుర్తింపు ఉందంటున్న
మంత్రి శ్రీనివాస్గౌడ్
నామినేషన్ల ఉపసంహరణకు రేపటి వరకు అవకాశం
అనంతరం బరిలో మిగిలే అభ్యర్థుల వివరాలు వెల్లడి
కొత్తూరు, ఏప్రిల్ 20 : నామినేషన్ల పర్వం పూర్తికావడంతో అభ్యర్థులు బీ ఫామ్ల కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. టీఆర్ఎస్ తరపున కొన్ని వార్డుల్లో ఒక్కరే పోటీలో ఉన్నప్పటికీ, మరికొన్నిచోట్ల ఒకరికి మించి ఉన్నారు. ఈ వార్డుల్లో బుజ్జగింపు యత్నాలు జోరందుకున్నాయి. కాంగ్రెస్ నుంచి పెద్ద ఎత్తున టీఆర్ఎస్లోకి చేరడంతో ఆ పార్టీ నామమాత్రంగా మిగిలింది. టీఆర్ఎస్ నుంచి టికెట్ వస్తే గెలుపు ఖాయమనే నమ్మకం ఉండడంతో అందరూ ఆ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేశారు. కలిసి కట్టుగా పనిచేద్దామని.. ఇప్పటికే మంత్రి శ్రీనివాస్గౌడ్ శ్రేణులకు సూచించారు. కష్టపడిన వారందరికీ తప్పకుండా తగిన గుర్తింపు నిస్తామని, నామినేటెడ్ పోస్టులను ఇచ్చి గౌరవిస్తామని మంత్రి హామీ ఇవ్వడంతో ఎవరికి బీ ఫామ్ ఇచ్చినా టీఆర్ఎస్ను గెలిపించి తీరుతామని ఆ పార్టీ శ్రేణులు పట్టుదలతో ఉన్నాయి. ఎన్నికల ముందు నుంచి పక్కా ప్రణాళికతో పనిచేస్తున్న అధికార పక్షం అన్ని వార్డుల్లో గెలిచి కొత్తూరు మున్సిపాలిటీపై గులాబీజెండా ఎగురవేయాలనే పట్టుదలతో ఉంది.
మున్సిపాలిటీ ఎన్నికల బరిలో నిలిచేందుకు ఆశావహులు పోటీపడుతుండగా, ఇటు టీఆర్ఎస్ అధిష్టానం మాత్రం గెలిచే వారికే బీఫామ్ ఇవ్వాలని భావిస్తున్నది. కొత్తూరు మున్సిపాలిటీలో మొత్తం 12 వార్డులు ఉన్నాయి. ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి నాయకులు టికెట్ పొందేందుకు టీఆర్ఎస్ అభివృద్ధిని చూసి కాంగ్రెస్ మండలాధ్యక్షుడిలో సహా ఆ పార్టీ ఎంపీటీసీలు, మాజీ సర్పంచ్లు పార్టీలో చేరారు. బీజేపీ నుంచి చాలా మంది యువకులు పార్టీలోకి వచ్చారు. మంత్రి, ఎమ్మెల్యే వద్దకు వచ్చి తమకు ఉన్న గెలుపు అవకాశాలను వారు వివరిస్తున్నారు. మంత్రి శ్రీనివాస్గౌడ్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని చాలా వార్డుల్లో ఒకే వ్యక్తి టీఆర్ఎస్ నుంచి నామినేషన్ వేసేలా చూశారు. అయినప్పటికీ కొన్ని వార్డులో తీవ్ర పోటీ ఉన్నది. టీఆర్ఎస్ నుంచి ఒకటి కంటే ఎక్కువ నామినేషన్లు వేసిన వారిని ఈ నెల 22 వరకు ఉపసంహరించుకునేలా కసరత్తు చేస్తున్నారు. అయితే 1, 2, 4, 8, 12వ వార్డుల్లో టీఆర్ఎస్ నుంచి ఇద్దరు నామినేషన్ వేశారు. అలాగే 6వ వార్డులో ముగ్గురు, 11 వార్డు నుంచి నలుగురు నామినేషన్ వేశారు. పోటీ నుంచి తప్పుకున్న వారికి ఉన్నత పదవులు ఇస్తామని హామీ ఇస్తున్నారు. దీంతో ఎవరికి బీఫామ్ ఇచ్చినా వారి గెలుపుకోసం సమష్టిగా కృషి చేస్తామని టీఆర్ఎస్ నేతలు పేర్కొంటున్నారు. 12 వార్డుల్లో అత్యధిక మెజార్టీతో గెలిపించుకునేలా మంత్రి వ్యూహాన్ని అమలు చేస్తున్నారు.