మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు టీఆర్ఎస్లో చేరబోతున్నారు. కొన్ని రోజులుగా పార్టీ మారుతారని ఊహాగానాలకు తెరదించుతూ సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్లో పార్టీ అధినేత సీఎం కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకోనున్నారు. ఆలేరు నియోజకవర్గం నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలువడంతోపాటు మంత్రిగా పనిచేసిన మోత్కుపల్లి ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మంచి నేతగా గుర్తింపు పొందారు. తన అనుచరులతో భారీ ర్యాలీగా తెలంగాణ భవన్కు తరలివెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఆయన చేరికతో టీఆర్ఎస్ మరింతగా బలపడుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
యాదాద్రి భువనగిరి, అక్టోబర్17(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఎస్సీ(మాదిగ) సామాజిక వర్గానికి చెందిన మోత్కుపల్లి నర్సింహులు రాజకీయ జీవితం టీడీపీ నుంచి మొదలైంది. ఐదుసార్లు ఆలేరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన మోత్కుపల్లి ఎన్టీఆర్ ప్రభుత్వంలో మంత్రి గా పనిచేశారు. 2019 ఎన్నికలకు ముందు టీడీపీని వీడారు. మధ్యలో ఓ సారి కాంగ్రెస్లోకి వెళ్లినా.. అక్కడ ఇమడలేక.. మళ్లీ టీడీపీలో చేరారు. ఆ తర్వాత మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో బీజేపీలోకి వెళ్లిన ఆయన.ఇటీవలే ఆ పార్టీకి రాజీనామా చేశారు.
మోత్కుపల్లి రాజకీయ ప్రస్థానం..
మోత్కుపల్లి రాజకీయ జీవితమంతా రాజీలేని ప్రస్థానం కొనసాగింది. విద్యార్థి దశలోనే ఎన్టీఆర్ స్ఫూర్తితో 1982లో టీడీపీ నుంచి రాజకీయ అరగ్రేటం చేసిన మోత్కుపల్లి ఆలేరు నియోజక వర్గం నుంచి 2003లో తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత వచ్చిన ఉప ఎన్నికల్లో 19 85లో రెండోసారి గెలిచారు. 1989లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చేందుకు నిరాకరించింది. దీంతో ఇండిపెండెంట్గా పోటీ చేసి టీడీపీ అభ్యర్థి సున్నం యాదగిరిపై భారీ మెజార్టీతో గెలిచి తన సత్తాను చాటుకున్నారు. ఆ త ర్వాత కొద్దికాలానికే తిరిగి టీడీపీలో చేరిన మోత్కుపల్లి పార్టీలో దళిత నేతగా ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. అనంతరం ఆలేరు నియోజకవ ర్గం జనరల్కు మారడంతో.. ఆ తర్వాత తుంగతుర్తి నియోజకవర్గం(ఎస్సీ) నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. టీడీపీ ప్రభుత్వంలో మొదటిసారి ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్గా, భూగర్భ గనులు, విద్యుత్, టూ రిజం, సాంఘిక సంక్షేమశాఖల మంత్రిగానూ పనిచేసి అభివృద్ధ్ది, సంక్షేమంలో తనదైన ముద్ర వేశారు. ఆలేరు ప్రజలతో పెనవేసుకున్న రాజకీయాల నేపథ్యంలో పదవిలో లేకున్నా కార్యకర్తలకు భరో సా కల్పిస్తూ నాయకుడిగా మంచి గుర్తింపు పొందారు.
కేసీఆర్ నాయకత్వాన్ని బలపర్చాలి : మోత్కుపల్లి
సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని అన్నివర్గాల ప్రజలు బలపర్చాల్సిన అవసరం ఉంది. దేశంలో ఏ రాష్ట్రం అమలు చేయని పథకాలను సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారు. రైతుబంధు, ఉచిత విద్యుత్ వంటి ఎన్నో పథకాలను అమలుచేసి రాష్ర్టాన్ని ఆదర్శంగా నిలిపారు. సామాజిక, ఆర్థిక భద్రతతోనే సమసమాజ స్థాపన సాధ్యపనుండగా.. కులవ్యవస్థ గురించి ఇప్పటివరకు ఆలోచించిన నాయకుడు లేదు. ఏడు దశాబ్దాలుగా వివక్షతకు గురైన దళితులను ఆదుకునేందుకు సీఎం కేసీఆర్ సంకల్పించి మార్పునకు మారుపేరుగా నిలిచారు.
రాబోయే కాలంలో దళితులతోపాటు పేదలు, రైతుల అందరూ ఏకమై సీఎం కేసీఆర్ నాయకత్వంలో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది.