యాదాద్రి భువనగిరి జిల్లాలో బుధవారం సద్దుల బతుకమ్మ సంబురాలు అంబరాన్నంటాయి. తీరొక్క పూలతో బతుకమ్మను తీర్చిదిద్దిన ఆడబిడ్డలు సాయంత్రం వేళ ఒక్కచోట చేరి ఆటపాటలతో సందడి చేశారు. ఈ సందర్భంగా ఉయ్యాల పాటలు హోరెత్తాయి. చప్పట్లతో పరిసరాలు మార్మోగాయి. అనంతరం సమీప చెరువుల వద్దకు వెళ్లి ‘పోయిరా గౌరమ్మా.. పోయిరావమ్మా.. బంగారు బతుకమ్మ వెళ్లిరావమ్మా’ అంటూ బతుకమ్మలను నిమజ్జనం చేసి వాయినాలు ఇచ్చిపుచ్చుకున్నారు. భువనగిరి పట్టణంలో మహిళల ఆటా పాట, తారాజువ్వలు, బాణాసంచాల వెలుగుల నడుమ సద్దుల బతుకమ్మ శోభాయాత్ర ఆద్యంతం సంబురంగా సాగింది. పెద్ద చెరువులో బతుకమ్మలను నిమజ్జనం చేయగా.. మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని ఆనంద పారవశ్యంలో తేలియాడారు. వేడుకల్లో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పాల్గొనగా.. భువనగిరి ఎమ్మెల్యే సతీమణి పైళ్ల వనిత హౌజింగ్ బోర్డులో నిర్వహించిన వేడుకల్లో బతుకమ్మ ఆడారు.