“రైతన్నల తరఫున గులాబీ దళం ధర్మయుద్ధం చేస్తున్నది.. కేంద్రం యాసంగి వడ్లు కొనేవరకు సీఎం కేసీఆర్ నాయకత్వంలో న్యాయంగా గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఆందోళనలు సాగిస్తాం.. మొదటి దశ పోరు సూపర్ సక్సెస్ కాగా.. రెండో దఫా యుద్ధం సాగిస్తున్నాం.. రాజకీయ నాటకాలు పక్కన బెట్టి రైతులపై ప్రేమ ఉంటే స్థానిక కమలనాథులు ధాన్యం కొనిపించాలి.. అప్పుడేమో వరి వేయండి.. మేము కొనిపిస్తం అన్నరు.. ఇప్పుడేమో తోకముడుచుకొని కూర్చున్నరు.. ఇదంతా ప్రజలు గమనిస్తున్నరు. సరైన సమయంలో బుద్ధిచెబుతారు..” అని మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు బీజేపీపై మండిపడ్డారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీశాఖ మాత్యులు కేటీఆర్ పిలుపు మేరకు.. గురువారం జిల్లాకేంద్రాల్లో టీఆర్ఎస్ శ్రేణులు రైతన్నలతో కలిసి నిరసన దీక్ష చేపట్టాయి. కర్షకులు భారీ సంఖ్యలో కదిలి రాగా.. రహదారిపై వడ్లు పారబోశారు. నల్లకండువాలు మెడలో ధరించి.. ప్లకార్డులు, వరి గొలుసులు చేతబూని నిరసన తెలిపారు.
తెలంగాణలో పండిన వరి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ రెండో విడుతగా గులాబీ దండు ఆందోళనలు నిర్వహిస్తున్నది. ఇందులో భాగంగా గురువారం జిల్లాకేంద్రాల్లో రైతులతో కలిసి టీఆర్ఎస్ శ్రేణులు నిరసన దీక్ష నిర్వహించారు. వేలాది మంది కర్షకులు రాగా.. కలెక్టరేట్ ప్రాంతాలు కిక్కిరిసి పోయాయి. ఎడ్లబండ్లు, ట్రాక్టర్లు, ద్విచక్రవాహనాల్లో తరలివచ్చారు. నిర్మల్ జిల్లాలో రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, జడ్పీ చైర్ పర్సన్ విజయలక్ష్మి, ఎమ్మెల్యేలు విఠల్రెడ్డి, రేఖానాయక్.. మంచిర్యాల జిల్లాలో ప్రభుత్వ విప్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్, మంచిర్యాల, బెల్లంపల్లి ఎమ్మెల్యేలు దివాకర్రావు, దుర్గం చిన్నయ్య, ఎమ్మెల్సీ దండె విఠల్, జడ్పీ చైర్పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి, మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్ కుమార్, మాజీ ఎమ్మెల్యేలు గడ్డం అరవిందరెడ్డి, నల్లాల ఓదెలు.. ఆదిలాబాద్ జిల్లాకేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే జోగు రామన్న, ఎమ్మెల్యేలు జోగు రామన్న, బాపురావు, జడ్పీ చైర్మన్ జనార్దన్ రాథోడ్లు.. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, ఎమ్మెల్సీ దండె విఠల్, జడ్పీ చైర్పర్సన్ కోవ లక్ష్మి, ఎమ్మెల్యే ఆత్రం సక్కులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి అల్లోల, విప్ సుమన్, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ నాయకత్వంలో కేంద్రమే యాసంగి వడ్లు కొనాలని ధర్మంగా పోరాడుతున్నామని, తెలంగాణ ప్రగతి పథంలో దూసుకుపోతుంటే కమలనాథులకు గిట్టడం లేదని మండిపడ్డారు.
121 ఆర్టికల్ ప్రకారం కేంద్రమే వడ్లు కొనాలి..
ఎదులాపురం, ఏప్రిల్ 7 : ఎఫ్సీఐ ఆర్టికల్ 121 ప్రకారం కేంద్రమే ధాన్యాన్ని కొనుగోలు చేయాలని స్పష్టంగా ఉందని టీఆర్ఎస్ పార్టీ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. గురువారం కలెక్టర్ ఎదుట ఎమ్మెల్యేలు జోగు రామన్న, బాపురావు, జడ్పీ చైర్మన్ జనార్దన్ రాథోడ్ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా జోగు రామన్న మాట్లాడుతూ.. యాసంగిలో పండించిన ధాన్యం కొనుగోలు చేసే వరకు బీజేపీ ప్రభుత్వంతో కొట్లాడుతామని, బీజేపీ అధ్యక్షుడు సంజయ్ ధాన్యం కొనుగొలు చేస్తామని ఇచ్చిన వాగ్ధానం మర్చిపోయావా? అంటు ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో గల్లీ నుంచి ఢిల్లీ దాకా కేంద్ర ప్రభుత్వంపై పోరాటం చేస్తామన్నారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకనే రాజికీయ లబ్ధి కోసమే ధాన్యం కొనుగోలు చేయమని నాటకాలు ఆడుతున్నారు. అనంతరం జడ్పీ చైర్మన్ జనార్దన్ రాథోడ్ మాట్లాడుతూ.. గత నెలలో జడ్పీ అత్యవసర సమావేశం నిర్వహించి తీర్మానాలు కేంద్రానికి పంపినట్లు గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు, డీసీసీబీ చైర్మన్ భోజారెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ గోవర్ధన్రెడ్డి, జడ్పీటీసీల ఫోరం అధ్యక్షుడు రాజు, ఎంపీపీల ఫోరం అధ్యక్షుడు శ్రీనివాస్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మెట్ట ప్రహ్లాద్, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ రంగినేని మనీషా, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
కేంద్రం వరిధాన్యం కొనకుంటే తెలంగాణ రైతులు పంజాబ్ రైతులను మించి ఉద్యమం చేస్తరు. కేంద్రం ఇట్ల తిరకాసు వెట్టుడుతోటి తాంసి, భీంపూర్ మండలాలల్ల వరిపంట తగ్గిపోయింది. ఒగ పథకం ప్రకారం కేంద్రమోళ్లు తెలంగాణ రైతాంగాన్ని దెబ్బతీయాలని సూస్తున్నరు. చెరువులు, కుంటలు, ప్రాజెక్టులు, రైతుబంధు, ఎవుసం లోనింగ్, ఉచిత కరెంటు తోటి ఇపుడు తెలంగాణల రైతు సంతోషంగ ఉన్నడు. ఇది చూసి ఓర్వలేకనే సెంటరు ఇట్ల కష్టపెడుతున్నది. ఇగ ఇక్కడ కాంగ్రెస్,బీజేపీ నాయకులు ఏం మాట్లాడుతున్నరో ఆళ్లకే అర్థయితలే. కేంద్రం దిగిరాకుంటే గ్రామంలోనే కాదు ప్రతి రైతు ఇంటా నిరసన మొదలవుతది. ఇక్కడి బీజేపీ నాయకులు తెలంగాణ రైతుల కష్టం, కన్నీరు, కోపం సుకా అటు సెంటర్లోకు చెప్పుకోవాల. ప్రధాని బాగా ఆలోచించి మంచి నిర్ణయం తీస్కోవాల. లేకుంటే ఎవుసం చట్టాల తీరే అభాసుపాలవుతరు.
– తాటిపెల్లి రాజు, జడ్పీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షుడు ,ఆదిలాబాద్
చరిత్రల రైతును పట్టించుకోని పార్టీలు గోదావరిల, సముద్రంల కలిసిపోయినయి. ఇపుడు బీజేపీ కూడా ఆ దారిలనే పోతున్నది. లోకంకు అన్నంపెట్టేటి రైతు మీద సెంటరు పెద్దలకు కోపం ఎందుకో అర్ంథకావల్లేదు. ఎదులాపురంల ఉన్న బీజేపీ నాయకులు, కార్యకర్తలల్ల మస్తుమంది రైతులున్నరు. మరి ఆళ్లు తెలంగాణ సర్కారు రైతుబంధు, కరెంటు తీస్కుంటున్నరా లేదా చెప్పాల. అసుంటప్పుడు ఉప్పుతిన్న ఉపకారం అయితే కాపాడాల కదా. ఆల్లు సుతా బండిసంజయ్ ఎట్లంటే అట్లనే తానతందానా అంటున్నరు. రైతును పట్టించుకోకుంటే పాపం తగుల్తది. గీ మాట ప్రధానిసారుకు తెలిసి ఉండిసుకా గిట్ల చేస్తున్నడంటే సెంటరుల బీజేపీ పాలనకు ఫుల్స్టాపు పెట్టుకుంటున్నరన్నమాట . మేము ఆందోళన ఆపం. వరి కొనిపించి తీరుతం.
– అరుణ్కుమార్, టీఆర్ఎస్ కన్వీనర్ తాంసి మండలం
టీఆర్ఎస్ ఆధ్వర్యంలో పల్లెపల్లెన నిరసనలు. కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మల దహనాలు. ప్రతి రైతు ఇంటిపై నల్లా జెండాల ఎగురవేత. మున్సిపాలిటీల్లో బైక్ ర్యాలీలు.కేంద్రంలోని బీజేపీ సర్కారు బాజాప్తా యాసంగి వడ్లు కొనాల్సిందే. కమలనాథులు వరి వేయమని చెప్పి ఇప్పుడు కొనకుండా మోసం చేస్తున్నారు.
– మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి
రైతన్నల కోసం పుట్టిన పార్టీ టీఆర్ఎస్. కేంద్రం మెడలు వంచైనా ధాన్యం కొనిపిస్తం. గతంలో గుజరాత్ దేశానికే రోల్ మోడల్ అనే వారు.. ప్రస్తుతం తెలంగాణ రోల్ మోడల్గా మారింది.
– ప్రభుత్వ విప్ బాల్క సుమన్
ఆర్టికల్ 121 ప్రకారం కేంద్రమే ధాన్యాన్ని కొనుగోలు చేయాలని స్పష్టం ఉంది. వడ్లు కొనేవరకు బీజేపీతో కొట్లాడుతామని, సీఎం కేసీఆర్ వెంట ఉండి నిరంతరంగా రైతుల తరఫున పోరాడుతాం.
– ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న
బీజేపీ నాయకుల తీరు సిగ్గుచేటు. రైతులతో రాజకీయాలు మానుకోవాలి. సీఎం కేసీఆర్ పాలన చూసి ప్రధాని మోదీ భయపడుతున్నడు. రాజకీయంగా లబ్ధిపొందాలని స్థానిక నాయకులతో ఆరోపణలు చేయిస్తున్నడు.
– సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప