తాండూరు రూరల్, సెప్టెంబరు 15 : పట్టణాలతో పల్లెలు అభివృద్ధిలో పోటీ పడుతున్నాయి. పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా పల్లెలన్నీ అభివృద్ధి వైపు పయనిస్తున్నాయి. అందులో భాగంగా తాండూరు మండలం, అంతారం గ్రామం అభివృద్ధిలో ఆదర్శంగా నిలుస్తున్నది. గ్రామంలోని వీధులన్నీ ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా చేస్తూ, తడి, పొడి చెత్తను సేకరించి డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. అదేవిధంగా ప్రతి సోమ, మంగళ, బుధవారాల్లో మురుగు కాలువలను శుభ్రం చేస్తున్నారు. గురువారం రోడ్ల శుభ్రతతోపాటు కలుపు మొక్కలను తొలగించడం చేస్తున్నారు. అదేవిధంగా శుక్రవారం హరిత హారంలో భాగంగా నాటిని మొక్కలకు ట్యాంకర్ ద్వారా నీళ్లు పోయడం, కంచె సరి చేయడం, ప్రతి శనివారం ప్రభుత్వ భవనాలు పరిశుభ్రం చేస్తున్నారు. అభివృద్ధిలో అంతారం గ్రామాన్ని ఆదర్శంగా చేస్తున్నారు. అదేవిధంగా ప్రతి ఇంటికి చెత్త బుట్టలు కూడా పంపిణీ చేశారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రతి వార్డుల్లో రసాయన పదార్థాలు పిచికారీ చేస్తున్నారు. గ్రామంలో రెండు ఓహెచ్ఎస్ఆర్లను క్లోరినేషన్ చేసి, మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికీ నీటి కనెక్షన్ ఇచ్చి, తాగునీరు అందిస్తున్నారు. గ్రామంలో సుమారు 4 వేల జనాభా ఉండగా, 1200 కుటుంబాలున్నాయి. స్వచ్ఛ అంతారం గ్రామంలో భాగంగా ప్రతి ఇంటికి వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించారు. బహిరంగ మల, మూత్ర విసర్జన చేస్తే రూ.500 జరిమానా విధించాలని పంచాయతీ తీర్మానం చేసింది.
రూ.5 కోట్లతో అభివృద్ధి పనులు
గ్రామంలో సుమారు రూ.5 కోట్ల నిధులు వ్యయం చేసి అభివృద్ధి చేస్తున్నారు. రూ.22 లక్షలు వ్యయం చేసి రైతు వేదికను నిర్మించారు. అదేవిధంగా రూ.20 లక్షలతో పాఠశాల భవనంతోపాటు మౌలిక సవసతులు కల్పించారు. వీటితోపాటు గ్రామంలో రూ.15 లక్షల వ్యయంతో అంతర్గతంగా సీసీ రోడ్లు వేశారు. వీటితోపాటు రూ.1.50 లక్షలతో పల్లె ప్రకృతి వనం ఏర్పాటు చేశారు. రూ.15 లక్షల వ్యయంతో వైకుంఠధామం పనులు కూడా పూర్తి చేశారు. రూ.15 లక్షలతో కంది పంట నిల్వ ఉంచుకునేందుకు కందుల గోదాంను నిర్మించారు. లక్ష రూపాయల వ్యయం చేసి హెల్త్ సెంటర్ నిర్మాణ పనులు కూడా పూర్తి చేశారు.
విరివిగా మొక్కలు నాటాం
గ్రామంలోని రోడ్ల వారీగా, పల్లె ప్రకృతి వనం, అర్బన్ పార్కులో హరితహారంలో భాగంగా విరివిగా మొక్కలు నాటాం. ఎన్ఆర్ కాలనీ నుంచి గుట్టవాగు రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటాం. గ్రామానికి కేటాయించిన టార్గెట్ పూర్తి చేశాం. పల్లె ప్రగతిలో కోట్ల రూపాయలు వ్యయం చేసి, అభివృద్ధి పనులు వేగవంగా చేస్తున్నాం. అందరి సహకారంతోనే అంతారం గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నాం.
రూ.4 కోట్ల అభివృద్ధి పనులు
ప్రస్తుతం రూ.4 కోట్ల అభివృద్ధి పనులు ప్రగతిలో ఉన్నాయి. అందులో అర్బన్ పార్కు రూ.1.50 కోట్ల పనులు ప్రగతిలో ఉండగా, ఇండోర్ స్టేడియం రూ.1.50 కోట్ల పనులు, కోటి రూపాయల వ్యయం చేసి ఇండోర్ స్టేడియాన్ని నిర్మిసున్నారు. ఇవే గాకుండా పల్లె ప్రగతిలో సుమారు రూ.1.50 కోట్ల పనులు పూర్తి చేశాం. తాండూరు ఎమ్మెల్యే రోహిత్రెడ్డి సహకారంతో గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తాం.