పరిగి, అక్టోబర్ 7 : అర్హులకు రేషన్ కార్డుల కోసం గ్రామసభ ఏర్పాటు చేసి తీర్మానించాలని రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ కె.తిరుమలరెడ్డి సూచించారు. గురువారం పరిగి మండలం రంగాపూర్లో రేషన్ దుకాణం, అంగన్వాడీ కేంద్రం, పాఠశాల, హనుమాన్గండిలో రేషన్ దుకాణం, పరిగిలో పౌర సరఫరాల స్టాక్ పాయింట్, సర్కారు దవాఖానలను ఆయన సందర్శించారు. హనుమాన్గండిలో రేషన్ కార్డుల విషయమై అడుగగా.. ఏడుగురికిగాను ముగ్గురికే వచ్చాయని.. కార్డులు రానివారు 15 మంది వరకు ఉంటారని సర్పంచ్ గణేశ్ చెప్పారు. హనుమాన్గండి నుంచి 2 కిలోమీటర్లకు పైగా దూరం ఉన్న మైసమ్మగడ్డతండావాసులకు ఇబ్బందిగా ఉందని, మధ్యలో వాగు ఉండడంతో సరుకులు తీసుకువెళ్లడం ఇబ్బందిగా ఉందని సర్పంచ్ చెప్పారు. దీంతో ప్రతి నెల 5 రోజులపాటు మైసమ్మగడ్డతండాలో రేషన్ సరుకులు విక్రయించేలా ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా అధికారులను చైర్మన్ ఆదేశించారు.
అంత్యోదయ కార్డులపై చక్కెర ఇవ్వకపోవడంతో ఆగ్రహం
రంగాపూర్లో కొందరికి కార్డులు లేవని, దరఖాస్తు చేసుకున్నా కార్డులివ్వలేదని తెలియజేయగా.. వాటిని పరిశీలించి పరిష్కరించాలని ఆర్డీవోకు చైర్మన్ సూచించారు. అంత్యోదయ కార్డులకు చక్కెర ఇవ్వకపోవడంపై ఆయన సంబంధిత అధికారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి పౌష్టికాహారం, కోడిగుడ్లు, పాలు, బాలామృతంపై ఆరా తీశారు. పాఠశాలలో మధ్యాహ్న భోజనం వంట చేసేవారికి వైద్య పరీక్షలు జరిపించాలన్నారు. పరిగి సర్కారు దవాఖానలో బాలింతలతో చైర్మన్ మాట్లాడారు. వైద్య సేవలు బాగున్నాయని వారు తెలిపారు. అనంతరం డ్రోన్ ద్వారా మందుల తరలింపు ప్రక్రియపై ఆరా తీశారు. పరిగిలోని పౌర సరఫరాల స్టాక్ పాయింట్ను సందర్శించిన చైర్మన్ స్టాక్ పాయింట్ శుభ్రంగా ఉండేలా చూసుకోవాలన్నారు. మధ్యాహ్న భోజనం నాణ్యతను పరిశీలించారు.
రేషన్ షాపు, పాఠశాల, అంగన్వాడీ సెంటర్ల పరిశీలన
వికారాబాద్/ధారూరు, అక్టోబర్ 7 : 70 సంవత్సరాలు నిండిన వృద్ధులను గుర్తించి వారి ఇంటి వద్దకు వెళ్లి రేషన్ సరుకులు అందించాలని చైర్మన్ తిరుమలరెడ్డి తెలిపారు. గురువారం వికారాబాద్లోని ఎన్నెపల్లిలో రేషన్ షాపును, శివారెడ్డిపేటలోని ఉర్దూ మీడియం ప్రాథమిక పాఠశాల, అంగన్వాడీ సెంటర్లను సందర్శించారు. ఎన్నెపల్లి రేషన్ షాపులో ఓటీపీ ద్వారా రేషన్ సరుకుల పంపిణీ ప్రక్రియను పరిశీలించారు. అంతకు ముందు ధారూరు మండలం కెరెళ్లి గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, అంగన్వాడీ సెంటర్ను సందర్శించారు. గర్భిణులు, బాలింతలు, పిల్లలకు మంచి వైద్యం, పౌష్టికాహారం అందించాలని సూచించారు. ్లపాఠశాల ఆవరణలో అధికారులతో కలిసి మొక్కలు నాటారు. రేషన్ షాపుల్లో బియ్యంతో పాటు చక్కెర కూడా అందించాలని డీలర్లను ఆదేశించారు.
కార్యక్రమంలో ఫుడ్ కమిషన్ సభ్యుడు గోవర్ధన్రెడ్డి, జిల్లా అదనపు కలెక్టర్ మోతిలాల్, డీఆర్డీవో కృష్ణన్, జిల్లా వైద్యాధికారి తుకారాంభట్, డిప్యూటీ డీఎంఅండ్హెచ్వో జీవరాజ్, జిల్లా విద్యాధికారి రేణుకాదేవి, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి రాజేశ్వర్, మేనేజర్ విమల, డీడబ్ల్యూవో లలితకుమారి, ఆర్డీవో ఉపేందర్రెడ్డి, ఎంపీపీ అరవిందరావు, జడ్పీటీసీ హరిప్రియ, మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్, ఎంపీడీవో శేషగిరిశర్మ, డిప్యూటీ తహసీల్దార్ విజేందర్, ఎంఈవో బాబుసింగ్ ఉన్నారు.