రవీంద్రభారతి : దివ్యాంగుల సంక్షేమమే సీఎం కేసీఆర్ లక్ష్యమని, తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డ తరువాత రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు వికలాంగులు అని కాకుండా దివ్యాంగులు అని గౌరవంగా పిలువాలని చెప్పారని మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు.
ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి, మైనార్టీ, దివ్యాంగుల శాఖల ఆధ్వర్యంలో ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా మంత్రులు
కొప్పుల ఈశ్వర్, మహమూద్అలీ, వి. శ్రీనివాసగౌడ్, తలసాని శ్రీనివాసయాదవ్, మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అనంతరం కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ దివ్యాంగులు ఆత్మగౌరవంతో బతకడానికి వారికి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టామన్నారు. దివ్యాంగుల ఫించన్ను రూ.500 నుంచి రూ.3వేలకు పెంచిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కిందన్నారు. రాష్ట్రంలో సుమారు 5 లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నామన్నారు. ఇందుకు ఏటా 18 వందల కోట్ల రూపాయలు ఖర్చుఅవుతుందని చెప్పారు.
దివ్యాంగులును పెళ్ళి చేసుకుంటే లక్ష రూపాయల ప్రోత్సాహం ఇస్తున్నామన్నారు.అలాగే ఉద్యోగ రిజర్వేషన్లు 3 శాతం నుంచి 5శాతం పెంచిన ఘనత కూడా తెలంగాణ ప్రభుత్వానిదేన్నారు. అర్హులైన దివ్యాంగులకు 5 శాతం డబుల్ ఇండ్లు కేటాయిస్తామన్నారు. అంధత్వం ఉన్నవారికి ఉచిత కంప్యూటర్ శిక్షణతోపాటు ల్యాప్టాప్స్ ఇస్తున్నామన్నారు. రూ.90వేల విలువగల టూవీలర్లు, ,స్మార్ట్ఫోన్లు, వీల్చైర్లు, ట్రైసైకిళ్లను కూడా అందించామన్నారు.
దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఈ విధంగా సంక్షేమ పథకాలు లేవని ఆయన పేర్కొన్నారు.మానవ సేవే మాధవసేవ అని మనసారా భావిస్తున్న తెలంగాణ ప్రభుత్వం మీ బాగోగులు చూస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసిఆర్ అని పేర్కొన్నారు.
అనంతరం హోంమంత్రి మమహ్మద్ అలీ మాట్లాడుతూ దివ్యాంగులు ఆత్మ గౌరవంతో బతకడానికి సిఎం కేసిఆర్ అనేక సంక్షేమాలు ప్రవేశపెట్టారని కొనియాడారు.
మంత్రి వి. శ్రీనివాసగౌడ్ మాట్లాడుతూ దేశంలో ఏరాష్ట్రంలో కూడా లేని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి దివ్యాంగులు ఆత్మగౌరవంతో బతికేలా కేసీఆర్ చేశారని పేర్కొన్నారు. తలసాని శ్రీనివాసయాదవ్ మాట్లాడుతూ దివ్యాంగులు ఆత్మన్యూనతా భావాన్ని పూర్తిగా విడనాడి ఆత్మస్థెర్యం, ఆత్మవిశ్వాసం, దృఢ సంకల్పంతో ముందుకు సాగాలని ఆయన పిలుపు నిచ్చారు.
మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ దివ్యాంగులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ప్రభుత్వం అన్ని విధాల ఆదఉంటుందని ఆయన వారికి భరోసానిచ్చారు. అనంతరం దివ్యాంగులను శాలువాలు, మెమెంటోలతో మంత్రులు ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో సాంఘీక సంక్షేమ శాఖ అధికారులు డైరెక్టర్ శైలజ తదితరులు పాల్గొన్నారు.