బంజారాహిల్స్ : తెలంగాణ రాష్ట్రంలో గత ఏడేళ్లుగా జరుగుతున్న అభివృద్ది కార్యక్రమాలను గురించి తెలుసుకున్న తర్వాతనే బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా మాట్లాడాలని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సూచించారు.
ఖైరతాబాద్ డివిజన్ పరిధిలో కల్యాణలక్ష్మి,షాదీముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం గురువారం వెంకటరమణ కాలనీ మహిళా మండలి భవనంలో నిర్వహించారు 19మందికి కల్యాణలక్ష్మి చెక్కులను, 11మందికి షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే దానం అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే దానం నాగేందర్ మాట్లాడుతూ..రాష్ట్రంలో ప్రజా రంజకమైన పాలన సాగిస్తున్న సీఎం కేసీఆర్పై అవాకులు చెవాకులు పేలుతున్న బీజేపీ నాయకులు తీరు మార్చుకోవాలని హెచ్చరించారు. రాష్ట్రంలోని అభివృద్ది కార్యక్రమాలను కేంద్రంలోని మంత్రులు, సంస్థలు ప్రశంసిస్తుంటే ఇక్కడ బీజేపీ నాయకులు విమర్షించడం, వారి మాటలు విని జాతీయ అధ్యక్షుడు నడ్డా మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
తెలంగాణలో జరిగిన అభివృద్దిని గురించి తెలుసుకున్న తర్వాతనే మాట్లాడితే బాగుంటుందన్నారు. ఈ సందర్భంగా వెంకరమణ కాలనీ. పద్మావతికాలనీలలో చేపట్టాల్సిన అభివృద్ది పనులను స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ ప్రసన్న, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.