న్యూఢిల్లీ: గత పదేళ్లలో 152 పేపర్లు లీక్ అయ్యాయని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. అయితే ఒక్కరికి కూడా శిక్ష పడలేదని ఆయన విమర్శించారు. దేశంలోని విద్యా వ్యవస్థను లోపభూయిష్టంగా తీర్చిదిద్దారంటూ కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. (Rahul Gandhi) నీట్ లీక్పై సీజేపీ ఆధ్వర్యంలో ఆందోళనలు తీవ్రమవుతున్న తరుణంలో బుధవారం ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన ప్రెస్మీట్లో రాహుల్ గాంధీ మాట్లాడారు. విద్యార్థులు న్యాయమైన కారణంతోనే నిరసన తెలుపుతున్నారని అన్నారు.
కాగా, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అవినీతిపరుడు, అసమర్థుడని రాహుల్ గాంధీ ఆరోపించారు. మన అతిపెద్ద ఆస్తి అయిన భారతదేశ విద్యా వ్యవస్థను విద్యాశాఖ మంత్రి నాశనం చేస్తున్నారని విమర్శించారు. ‘ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. ఇది న్యాయమైన డిమాండ్. ప్రధాన్ ఒక అవినీతిపరుడు, అసమర్థుడు. ఈ గందరగోళం మొత్తానికి ప్రతీక. ఆయనను తప్పక తొలగించాలి’ అని అన్నారు.
మరోవైపు గత 10 ఏళ్లలో కనీసం 152 పేపర్ లీక్లు జరిగాయని, వాటిపై ఎటువంటి జవాబుదారీతనం లేదని రాహుల్ గాంధీ ఆరోపించారు. ‘పదేళ్లలో 152 సార్లు ప్రశ్నపత్రాలు లీక్ అయ్యాయి. అంటే సగటున నెలకు ఒక లీక్ అన్నమాట. ఈ లీక్లు కోట్లాది మంది విద్యార్థులపై ప్రభావం చూపాయి. అయినప్పటికీ, గత పదేళ్లలో పేపర్ లీక్ కేసుల్లో ఎవరికీ శిక్ష పడలేదు. విద్యార్థులు దీనిని ప్రశ్నిస్తున్నారు’ అని అన్నారు.
అయితే పేదలు, మధ్యతరగతి ప్రజలకు విద్యా వ్యవస్థ అందుబాటులో లేకుండా పోయిందని రాహుల్ అన్నారు. నీట్ కోచింగ్ కోసం దేశవ్యాప్తంగా అభ్యర్థులు ఏటా రూ. 1.32 లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నారని తెలిపారు. దేశ వార్షిక విద్యా బడ్జెట్ అయిన రూ. 1.4 లక్షల కోట్లతో ఇది దాదాపు సమానమని గుర్తు చేశారు. ఈ ‘లోపభూయిష్ట వ్యవస్థ’ పేద, మధ్యతరగతి వారిని విద్యకు దూరం చేస్తోందని ఆరోపించారు. ‘ఈ వ్యవస్థ కేవలం ధనికుల కోసమే. ఇందులో పేదలకు చోటు లేదు’ అని ఎద్దేవా చేశారు.
కాగా, మంగళవారం ప్రధాని మోదీ నివాసం వెలుపల ధర్నా సందర్భంగా పోలీసులు తనతో దురుసుగా ప్రవర్తించడంపై మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు రాహుల్ గాంధీ సమాధానమిచ్చారు. ‘కొన్ని పిడిగుద్దుల గురించి గానీ, నా పట్ల ఎలా ప్రవర్తించారనే దాని గురించి గానీ నేను పట్టించుకోను. ప్రభుత్వం నాతో ఎలా వ్యవహరిస్తుందన్నది ముఖ్యం కాదు. విద్యార్థుల డిమాండ్లు, వారి భవిష్యత్తు మాత్రమే ముఖ్యం’ అని అన్నారు. విద్యార్థులపై దాడి చేసిన పోలీస్ అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రధాని మోదీ విద్యార్థులకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.