మల్లన్నను దర్శించుకున్న భక్తులు
చేర్యాల, సెప్టెంబర్ 19 : కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారిని ఆదివారం భక్తులు భారీగా దర్శించుకున్నారు. సుమారు 10 వేలకు పైగా భక్తులు ఆలయానికి వచ్చి మల్లన్నను దర్శించుకొని, మొక్కులు చెల్లించుకున్నట్లు ఆలయ ఈవో బాలాజీ, చైర్మన్ గీస భిక్షపతి తెలిపారు. భక్తులు శనివారం సాయంత్రం నుంచే కొమురవెల్లికి చేరుకున్నారు. ఆదివారం స్వామి వారిని దర్శించుకొని అభిషేకాలు, పట్నాలు, అర్చన, ప్రత్యేక పూజలు, ఒడి బియ్యం, కేశఖండన, గంగిరేగు చెట్టు వద్ద ముడుపులు కట్టి మొక్కులు తీర్చుకున్నారు. కొండపైన ఉన్న ఎల్లమ్మను దర్శించుకొని అమ్మవారికి బోనం సమర్పించారు. మరికొందరు భక్తులు రాతిగీరల వద్ద ప్రదక్షిణలు, కోడెల స్తంభం వద్ద కోడెలు కట్టేసి పూజలు నిర్వహించారు. పూజాకార్యక్రమాల్లో ఆలయ ఏఈవో వైరాగ్యం అంజయ్య, ప్రధానార్చకుడు మహాదేవుని మల్లికార్జున్, డైరెక్టర్లు, సిబ్బంది, అర్చకులు భక్తులకు సేవలందించారు.
‘మల్లన్న’ సింహాసనానికి రూ.80వేల విరాళం
కొమురవెల్లి మల్లికార్జున స్వామి నిత్య కల్యాణం చేసే సింహాసనానికి ఇత్తడి తొడుగులు ఏర్పాటు చేసేందుకు హైదరాబాద్కు చెందిన మామిడి పాండు అనే భక్తుడు రూ.80వేలను విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ గీస భిక్షపతి మాట్లాడారు. మల్లన్న ఆలయ అభివృద్ధికి దాతలు ముందుకు రావాలని కోరారు.