దుబ్బాక, అక్టోబర్ 14: బతుకమ్మ పండుగ కోసం ఎంతో సంతోషంగా తన ఇద్దరు పిల్లలతో పుట్టింటికి వచ్చిన వివాహిత ప్రమాదవశాత్తు కూతురితో సహా చెరువులో పడి తిరిగిరాని లోకాలకు వెళ్లిన ఘటన సిద్దిపేట జిల్లా దుబ్బాక మం డలం ఎనగుర్తిలో జరిగింది. గ్రామస్తులు, పోలీసుల వివరాల ప్రకారం.. ఎనగుర్తి గ్రామానికి చెం దిన ఎనగుర్తి భారతమ్మ, మల్లయ్య దంపతుల చిన్న కూతురు రోజాను పదేండ్ల కిందట మిరుదొడ్డి మండలం వీరారెడ్డిపల్లికి చెందిన చెప్యాల నరేశ్కు ఇచ్చి వివాహం చేశారు. వీరికి రేష్మిక, చైత్ర ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. గురువారం ఉదయం స్థానిక బండకుంట చెరువు వద్దకు బట్టలు ఉతికేందుకు రోజా తన కూతుళ్లతో వెళ్లింది. చెరువు గట్టుపై కూతుళ్లను ఆడుకోమ్మని చెప్పి చెరువులో బట్టలు ఉతికేందుకు దిగింది. ఈ క్రమంలో రోజా చిన్న కూతురు చైత్ర (4) గట్టుపై నుంచి జారి చెరువులో పడింది. పెద్ద కూతురు రేష్మిక కేకలు వేయడంతో తల్లి బిడ్డను కాపాడేందుకు వెళ్లి నీటమునిగింది. చెరువులో నుంచి తల్లి, చెల్లెలు బయటకు రాకపోవడంతో రేష్మిక ఏడుస్తూ అమ్మమ్మకు సమాచారం అందించింది. ఈతగాళ్ల సహాయంతో తల్లీకూతుళ్ల మృతదేహాలను బయటకు తీశారు. కూతురు, మనుమరాలు మృతిచెందడంతో రోజా తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. భూంపల్లి పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాలను పోస్టుమార్టం కోసం దుబ్బాక ప్రభుత్వ దవాఖానకు తరలించారు.