KCR | హైదరాబాద్ నగర బ్రాండ్ ఇమేజ్ను అంతర్జాతీయంగా కాంగ్రెస్ ప్రభుత్వం దిగజారుస్తోందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మండిపడ్డారు. మేడ్చల్ మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలోని దుండిగల్ రోడ్షోలో కేసీఆర్ మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘మీరు పట్టణ ప్రాంత వాసులు. హైదరాబాద్ నగరానికి సమీపంలో ఉంటరు. రాజకీయ చైతన్యంలో మీలో ఎక్కువ. నాలుగైదు నెలల్లోనే ఈ రాష్ట్రంలో పరిస్థితులు ఎంత తారుమారయ్యాయో మీకు తెలుసు. మనతో రెండుపార్టీలు ఉన్నయ్. నరేంద్ర మోదీ బీజేపీ. రెండోది కాంగ్రెస్ పార్టీ. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చి ఈ దేశంలో పది సంవత్సరాలు గడుస్తున్నది. మోదీ 150 నినాదాలు ఇచ్చిండు. నరేంద్ర మోదీ ఆ రోజు చెప్పిండు. బీజేపీని గెలిపిస్తే విదేశాల్లోని నల్లధనం తెచ్చి ప్రతి ఇంటికి రూ.15లక్షలు ఇస్తమన్నరు. మరి మీకు వచ్చినయా? రాలేదా? ఈటల రాజేందర్ చెబుతున్నడు. మరి ఏం చేయాలి ? 3లక్షల మెజారిటీతోని రాగిడి లక్ష్మారెడ్డిని గెలిపించాలి’ అని పిలుపునిచ్చారు.
‘బేటీ పడావో బేటీ బచావో ఏమన్నా జరిగిందా? వికసిత్ భారత్లో ఏమైనా జరిగిందా? అమృత్ కాల్ వచ్చిందా? అచ్చేదిన్ వచ్చినయా? అంతా వట్టి ట్రాషే ఏమీ లేదు. మోదీ పాలనలో విదేశీ మారక నిల్వలు పడిపోయాయి. దేశ ప్రతిష్ట మంటగలిసిపోతున్నది. మొన్న అరవింద్ కేజ్రీవాల్, కవితను అరెస్టు చేస్తే.. అమెరికా దేశం సైతం తమ నిరసన వ్యక్తం చేసింది. అంతర్జాతీయంగా విశ్వగురువు అని ప్రచారం చేసుకునే మోదీ.. విశ్వం మొత్తం మీద దేశ ప్రతిష్టను మంటగలుపుతున్నడు. వాళ్లు చేసేది ఏమీ లేదు. అంతా వట్టి ట్రాషే తప్ప. బీజేపీతో జరిగేదీ ఏమీ లేదు. మోదీ మోసం చేశాడు. హైదరాబాద్ నగరంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఐటీరంగాన్ని ఎంత అభివృద్ధి చేసినమో మీకు తెలుసు. ఐటీఐఆర్ మనకు హైదరాబాద్కు చట్టం ప్రకారం ఉండేది. దాన్ని కూడా తీసేశాడు. ఐటీఐఆర్ తీసుకొనిపోయాడు. తెలంగాణకు వచ్చిన ఏడు మండలాలు.. మనకు 400మెగావాట్ల పవర్ ఇచ్చే సీలేరు పవర్ ప్రాజెక్టు ఆంధ్రాకు అప్పగించాడు. మళ్లీ ఇప్పుడు ఏమంటున్నడు. మీ గోదావరి జలాలు, కృష్ణా జలాలు తీసుకుపోయి కర్ణాటక, తమిళనాడుకు ఇస్తామంటున్నడు. ఒప్పుకుందామా? యుద్ధం చేద్దామా? మన కృష్ణ, మన గోదావరి మనకే దక్కాలంటే లక్ష్మారెడ్డిలాంటి వీరులు గెలిస్తేనే పార్లమెంట్లో గొంతుపట్టుకుంటరు’ అన్నారు.
‘బీఆర్ఎస్ గవర్నమెంట్లో శివారు ప్రాంతాల్లో మల్కాజ్గిరి నియోజకవర్గం ప్రాంతంలో మంచినీటి సరఫరా ఎలా ఉండేదో మీకు తెలుసు. పుష్కలంగా తెచ్చి ఇచ్చినం. కొత్త పైపులైన్లు వేసినం. కొత్త ట్యాంకులు కట్టాం. కృష్ణారావు, వివేక్ గౌడ్, మల్లారెడ్డి కానీ.. మల్కాజ్గిరి, కూకట్పల్లి, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్ కావచ్చు. బ్రహ్మాండంగా నీటి సరఫరా జరిగింది. మళ్లీ ఇవాళ నీటి ట్యాంకులు కొనుక్కునే పరిస్థితి వస్తుంది. ఎందుకు భూముల ధరలు పడిపోయినయ్. ఎందుకు రియల్ ఎస్టేట్ ఆగిపోయింది. జంట నగరాలను నేను ముఖ్యమంత్రి ఉండే రోజు పవర్ ఐలాండ్గా మార్చాను. న్యూయార్క్లో, లండన్లో కరెంటు పోయినా.. హైదరాబాద్లో కరెంటుపోకుంట చేసిన. అది మీ అందరికీ తెలుసు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు కన్నురెప్పపాటు కరెంటు పోలేదు. రాష్ట్రంలో అన్ని జనరేటింగ్ స్టేషన్లలో నేషనల్ గ్రిడ్లో లింక్ చేసినం. అంతబాగా చేసిన హైదరాబాద్ నగరంలో రోజూ సోషల్ మీడియాలో చూస్తున్న నిన్న కొద్దిపాటి వాన పడితే ఆరు, ఎనిమిది, పదిగంటలు కరెంటు పోతున్నది’ అన్నారు.
‘రాష్ట్రం ప్రతిష్టపోతున్నది. పరిశ్రమలు వెళ్లిపోతున్నయ్. కార్నింగ్ అనే పరిశ్రమ రూ.1000కోట్లతో పెట్టుబడులతో నేను ముఖ్యమంత్రిగా ఉన్ననాడు వస్తే అది మద్రాస్కి తరలిపోయింది. ఈ ప్రభుత్వం మీద నమ్మకం లేక. పరిశ్రమలు తరలిపోవడం.. కరెంటుపోవడం.. మంచినీళ్లు రాకపోవడం నగరం బ్రాండ్ ఇమేజ్ అంతర్జాతీయంగా పడగొట్టే దుర్మార్గ చర్యలకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పాల్పడుతున్నది. రియల్ ఎస్టేట్ కింద ఎలాంటి ధరలు ఉండే హైదరాబాద్లో. ఎంత బాగా వ్యాపారం జరిగేది. ఈ ముఖ్యమంత్రి ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నడి ప్రధాని నరేంద్ర మోదీయే చెప్పిండు మొన్న. రియల్ ఎస్టేట్ వాళ్ల దగ్గర స్కేర్ఫీట్కు ఇంత అని వసూలు చేసి ఢిల్లీకి కప్పం కడుతున్నరని ప్రధాని మోదీ స్వయంగా చెప్పిండు. అంటే అవినీతికి ఆలవాలం చేసి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని దెబ్బతీస్తున్నరు. పరిశ్రమలు తరలిపోతున్నయ్. ఐటీరంగం కుదేలవుతున్నది. తెలంగాణ కోసం పేలుగు తెగేదాక కొట్లాడే ఒకే ఒక్క పార్టీ బీఆర్ఎస్ పార్టీ. రేపు పార్లమెంట్లో మనోళ్లు డజన్ మంది ఉంటేనే ఖచ్చితంగా తెలంగాణ హక్కులు కాపాడుతరు. తెలంగాణకు నిధులు తెస్తరు. కాబట్టి రాగిడి లక్ష్మారెడ్డిని గెలిపించాలని కోరుతున్నా’నని చెప్పి ముగించారు.