న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని రామ్ మనోహర్ లోహియా (ఆర్ఎంఎల్) హాస్పిటల్ (RML hospital) లోని అవినీతి రాకెట్ను కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) చేధించింది. లంచాలు తీసుకుంటున్న డాక్టర్లు, నర్సులతో సహా 9 మందిని అరెస్ట్ చేసింది. ప్రభుత్వ ఆసుపత్రిలోని వైద్యులు, వైద్య సిబ్బంది కలిసి రోగులు, వైద్య పరికరాల సరఫరాదారుల నుంచి లంచాలు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై ఫిర్యాదులు అందడంతో బుధవారం ఆర్ఎంఎల్ ఆసుపత్రితో సహా సుమారు 15 చోట్ల సీబీఐ అధికారులు సోదాలు చేశారు. డాక్టర్లు, నర్సులు, వైద్య సిబ్బంది, ప్రైవేట్ మధ్యవర్తులు, వైద్య పరికరాల సరఫరాదారులతో సహా తొమ్మిది మంది వ్యక్తులను అరెస్టు చేశారు.
కాగా, డాక్టర్ పర్వత్గౌడ (అసిస్టెంట్ ప్రొఫెసర్, కార్డియాలజీ విభాగం), డాక్టర్ అజయ్ రాజ్ (కార్డియాలజీ ప్రొఫెసర్), రజనీష్ కుమార్ (క్యాథ్ ల్యాబ్ సీనియర్ టెక్నికల్ ఇన్ఛార్జ్) షాలు షామా (నర్సు), క్లర్కులు భువాల్ జైస్వాల్, సంజయ్ కుమార్ గుప్తా, నాలుగు వైద్య పరికరాల కంపెనీలకు ప్రాతినిధ్యం వహించిన ఐదుగురు ప్రైవేట్ వ్యక్తులను ఎఫ్ఐఆర్లో నిందితులుగా పేర్కొన్నారు. వీరందరిపై నేరపూరిత కుట్ర, అవినీతి నిరోధక చట్టం కింద అభియోగాలు మోపారు. మరోవైపు ఢిల్లీలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో లంచాల కుంభకోణం బయటపడడం ఇది రెండోసారి.