KCR | తెలంగాణ కోసం పేగులు తెగేదాకా కొట్లాడే ఒకే ఒక పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని కేసీఆర్ అన్నారు. పార్లమెంటులో మనోళ్లు డజను మంది ఉంటేనే కచ్చితంగా తెలంగాణ హక్కులు కాపాడతారు.. తెలంగాణకు నిధులు తెస్తారని స్పష్టం చేశారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో దిగ్విజయంగా కొనసాగుతున్న కేసీఆర్ బస్సు యాత్ర ఇవాళ మల్కాజ్గిరి పార్లమెంటు పరిధిలోని దుండిగల్కు చేరుకుంది. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. మల్కాజ్గిరిలో రాగిడి లక్ష్మారెడ్డిని గెలిపించాలని కోరారు.
మల్కాజ్గిరి పార్లమెంటులో టైగర్లాంటి ఎమ్మెల్యేలు ఉన్నారని కేసీఆర్ అన్నారు. కుత్బుల్లాపూర్లో 85వేల ఓట్లతో గెలిచిన వివేకానంద ఉన్నాడు.. కూకట్పల్లిలో 70వేల ఓట్లతో గెలిచిన మాధవరం కృష్ణారావు ఉన్నారు.. ఇలా అసెంబ్లీ ఎన్నికల ప్రకారం చూస్తుంటే బీఆర్ఎస్కు దాదాపు 4 లక్షల మెజారిటీ వస్తుందని అన్నారు. రాగిడి లక్ష్మారెడ్డి చాలా మంచి వ్యక్తి, నిజాయతీపరుడు అని పేర్కొన్నారు. ఆయనకు రాజకీయాల్లో ఎప్పుడూ అవకాశం రాలేదు. ఫస్ట్ టైమ్ మనం టికెట్ ఇచ్చి నిలబెట్టుకున్నామని తెలిపారు.
‘ రాగిడి లక్ష్మారెడ్డి ఒక సంస్థ పెట్టి లక్షలాది మంది ప్రజలకు న్యాయం చేసిండు. వాటర్ ట్యాంకర్లు పెట్టి ప్రజలకు నీళ్లు సప్లై చేసిండు. పేదింటి బిడ్డల పెండ్లిళ్లు చేసిండు. లక్ష్మన్న అని పిలిస్తే నేనున్నా అంటూ కదిలొచ్చే మనిషి రాగిడి లక్ష్మారెడ్డి. ‘ అని పేర్కొన్నారు. సభ్యత, సంస్కారం ఉన్న వ్యక్తి రాగిడి లక్ష్మారెడ్డి అని అన్నారు. మల్కాజ్గిరిలో రాగిడి లక్ష్మారెడ్డి ఆల్రెడీ గెలిచిపోయిండు.. ఎలక్షన్ తేలిపోయిందని వ్యాఖ్యానించారు. వరుసపెట్టి చేవెళ్ల, సికింద్రాబాద్, మల్కాజ్గిరి, మెదక్, గెలుస్తున్నాం.. పార్లమెంటు ఎన్నికల్లో డజనుకు పైచిలుకు సీట్లు బీఆర్ఎస్ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ చేసిన మోసం ప్రజలకు అర్థమయ్యిందని తెలిపారు. లక్ష్మారెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.