KCR | ప్రధాని నరేంద్ర మోదీ ఎజెండాలో పేదల గోసలు, రైతుల బాధలుండవని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విమర్శించారు. నర్సాపూర్ రోడ్షోలో భాగంగా కార్నర్ మీటింగ్లో మాట్లాడారు. మెదక్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిని ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘నరేంద్ర మోదీ పార్టీతో ఏమన్నా పైసా లాభమైనా ఉన్నదా? సబ్కా సాత్ సబ్కా వికాస్ ఏమైనా అయ్యిందా? మోదీ పాలనో రూపాయి విలువ డాలర్తో పోలిస్తే రూ.84కి పడిపోయింది. ఏ ప్రధానమంత్రి కాలంలో దిగజారనంత దిగజారిపోయింది. పెట్టుబడులు పోయాయి. పరిశ్రమలు మూతపడ్డాయి. కార్మికులు రోడ్డునపడుతున్నరు. ఎల్ఐసీని ముంచే ప్రయత్నం చేస్తున్నరు. పబ్లిక్ సెక్టార్ అంతా ప్రైవేటీకరణ చేస్తున్నరు’ అంటూ మండిపడ్డారు.
‘మోదీ ఎజండాలో పేదల బాధలు, గోసలుండయ్. రైతుల బాధలుండవు. ఢిల్లీలో రైతులు ధర్నా చేస్తే.. 750 మంది రైతులను చంపిన వ్యక్తి నరేంద్ర మోదీ. మళ్లీ యూపీ ఎన్నికలు వస్తే సారీ చెప్పి.. మాఫీ చెప్పి వేడుకున్న వ్యక్తి మోదీ. ముఖ్యంగా యువకులు, విద్యా్ర్థులు, మేథావులు, ఆలోచనపరులతో నా మనవి. ఈ రాష్ట్రం, ఈ దేశం మనది. భవిష్యత్ మనది. దయచేసి ఆలోచించి ఓటు వేయండి. ఓ ఒరవడిలో కొట్టుకుపోయి ఓటు వేయడం కాదు. మనకు న్యాయం జరిగాలి. నర్సాపూర్లో లంబాడాలు ఎక్కువగా ఉన్నరు. నేను 58 సంవత్సరాలు మొత్తుకుంటే.. ఏ ముఖ్యమంత్రి లంబాడి తండాలను గ్రామ పంచాయతీలు చేయలేదు. తండాలను గ్రామ పంచాయతీలుగా చేసిందే కేసీఆర్. మీకు డైరెక్ట్గా నిధులు పంపిందే కేసీఆర్. గిరిజనులకు పదిశాతం రిజర్వేషన్లు పెట్టిందే కేసీఆర్. ఇవన్నీ ఉన్నయ్. టీఎస్పీఎస్సీలో గ్రూప్-1 పరీక్షలు జరుగుతున్నయ్. పరీక్షల సమయంలో హైకోర్టు ప్రభుత్వాన్ని అడిగింది. పదిశాతం రిజర్వేషన్లు విరుద్ధంగా ఉందని చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వం చాలా బలంగా వాదించాలి కదా? కొట్లాడాలి కదా? అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం రిపోర్ట్ తెప్పించి.. కమిటీ వేసి చేసిందాన్ని నిలబెట్టాలి కదా? ఇవాళ మనం లేము. వాళ్లు మాట్లాడే పరిస్థితుల్లో లేరు’ అన్నారు.
‘మన పదిశాతం రిజర్వేషన్ మనది మనకే ఉండాలన్నా.. పార్లమెంట్కి వెంకట్రామిరెడ్డి వెళ్లాలి. మన తరఫున వాదించాలి. గిరిజనులకు పోడు భూములు ఇచ్చాం. పోడు భూములకు రైతుబంధు పడ్డదా? బీఆర్ఎస్ ఉన్నప్పుడు వచ్చింది.. బీమా కూడా చేశాం. ఇప్పుడు రైతుబంధు ఎవరికీ లేదు. సమాజంలో ఏ ఒక్క వర్గం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పని చేయడం లేదు. అందరం ఏకమై తెలంగాణను కాపాడుకోవాలి. కృష్ణా, గోదావరి నీళ్లను నరేంద్ర మోదీ తమిళనాడుకు తీసుకుపోతా అంటున్నడు. దాన్ని కాపాడాలన్నా.. తెలంగాణ ఆత్మగౌరవం కాపాడాలన్నా ఖచ్చితంగా బీఆర్ఎస్ ఎంపీలుంటేనే పార్లమెంట్లో పులిబిడ్డల్లా కొట్లాడుతరు. ఆ నాడు తెలంగాణ కోసం ఎలాగైతే కొట్లాడినమో.. అట్ల కొట్లాడుతరు. అలా హక్కులు ఉంటయ్. ఆల్రెడి నాకు రిపోర్ట్ ఉంది. వెంకట్రామిరెడ్డి తెలంగాణ మొత్తం మీదనే అతిఎక్కువ మెజారిటీతో గెలిస్తున్నడు మీ దీవెనలతోని. నర్సాపూర్ నియోజకవర్గం నుంచి కనీసం 40వేల-50వేల మెజారిటీని తీసుకురావాలని కోరుతున్నానన్నారు.