రేపు ఆశ్వారావుపేట క్షేత్ర సందర్శనకు 300మంది రైతులు
విడతల వారీగా అన్ని సెగ్మెంట్ల నుంచి రైతులను తీసుకెళ్తాం..
జిల్లాలో ఫ్యాక్టరీ స్థాపనకు ప్రభుత్వ నిర్ణయం
టెలీ కాన్ఫరెన్స్లో తన్నీరు హరీశ్రావు
సిద్దిపేట జోన్, మార్చి 31: ఆయిల్పామ్ సాగుతో రైతులు ఆర్థికాభివృద్ధి సాధించవచ్చని, ఖమ్మం జిల్లా అశ్వరావుపేటకు వెళ్లి సాగు విధానాన్ని తెలుసుకోవాలని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు జిల్లా రైతులకు సూచించారు. ఆయిల్పామ్ సాగు పద్ధతులు తెలుసుకునేందుకు ఈనెల 2న అశ్వరావుపేటలో సందర్శనకు వెళ్తున్న 150 మంది రైతులు, 150 మంది ప్రజాప్రతినిధులు మొత్తంగా 300మందితో బుధవారం మంత్రి టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఇటీవల జిల్లా కేంద్రంలో రైతులకు ఆయిల్పామ్ సాగుపై అవగాహన సమావేశం నిర్వహించామని, జిల్లా ఆయిల్పామ్ సాగుకు అనువైన ప్రాంతమని కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసిందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్పామ్ సాగును ప్రోత్సహిస్తున్నదని, జిల్లాలో ఫ్యాక్టరీ ఏర్పాటు చేయనుందని చెప్పారు.
ఈ పంటను సాగు చేయడంతో అనేక ప్రయోజనాలు ఉన్నాయని, ఒకసారి సాగుచేస్తే 30 ఏండ్ల వరకు దిగుబడి వస్తుందని తెలిపారు. అశ్వరావుపేట క్షేత్ర స్థాయి సందర్శనలో పామాయిల్ నర్సరీ, ప్రాసెసింగ్ యూనిట్ను, దమ్మపేటలో రైతుల క్షేత్ర స్థాయిలో సందర్శించి అక్కడి రైతుల అనుభవాలను తెలుసుకోవాలని రైతులకు సూచించారు. ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా పడవేగిలోని ఆయిల్పామ్ రీసెర్చ్ సెంటర్ను సందర్శించి అక్కడి శాస్త్రవేత్తలతో మాట్లాడాలని కోరారు. కరోనా నేపథ్యంలో విడతల వారీగా అన్ని నియోజకవర్గాల నుంచి రైతులను అశ్వరావుపేటకు తీసుకెళ్తామని తెలిపారు. ఆయిల్ఫెడ్ కార్పొరేషన్, వ్యవసాయ, ఉద్యానవన శాఖల ఆధ్వర్యంలో ఈ క్షేత్ర స్థాయి సందర్శన ఏర్పాటు చేస్తున్నామన్నారు. వచ్చే వానకాలం జిల్లాలో మొదటి దశలో 3500 ఎకరాలు సాగు చేసుకునేందుకు ఆవకాశం ఉందని, ఆసక్తి గల రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
వెంకటయ్య ఎన్ని ఎకరాలు ఏస్తవు..
ఈ సందర్భంగా చిన్నకోడూరు మండలం ఇబ్రహీంనగర్కు చెందిన రైతు వెంకటయ్యతో టెలీ కాన్పరెన్స్లో మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ.. ఎన్ని ఎకరాలు ఏస్తవ్.. అశ్వరావుపేటకు పోతున్నావా.. సాగుచెయి లాభం ఉంటదని మంత్రి సూచించారు. చిన్నకోడూరు గ్రామానికి చెందిన రైతు రాజేశ్వర్రావుతో మాట్లాడగా… 4 ఎకరాలు ఎస్తము సార్ అని మంత్రితో చెప్పాడు. మీరు ఫోన్లో చెప్పిన అంశాలు బాగా అనిపించినయి సార్, అశ్వరావుపేట వెళ్లి వచ్చి సాగుచేసుకుంటాం… సార్ అని రైతు చెప్పాడు. దీంతో మంత్రి హరీశ్రావు మీకు ఏ సహకారం కావాలన్నా అందిస్తామని భరోసా ఇచ్చారు. టెలీ కాన్పరెన్స్లో రాష్ట్ర ఆయిల్ ఫెడ్ చైర్మన్ సురేందర్రెడ్డి, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు వంగ నాగిరెడ్డి, వ్యవసాయ ఆధికారి శ్రావణ్కుమార్, ఉద్యానవన శాఖ అధికారి రామలక్ష్మి, ఇండస్ట్రియల్ మేనేజర్ శివ ప్రసాద్, సుడా చైర్మన్ మారెడ్డి రవీందర్రెడి,్డ ఆత్మకమిటీ చైర్మన్ ప్రభాకర్ వర్మ, జడ్పీటీసీలు,ఎంపీపీలు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, పీఏసీఎస్ చైర్మన్లు, సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
ఇవి కూడా చుడండి
ఫిస్ట్బాల్ టీమ్కు మంత్రి ఎర్రబెల్లి అభినందన
కొవిడ్ టీకా రెండో డోసు తీసుకున్న స్పీకర్ పోచారం