ప్రతి బడ్జెట్లోనూ వ్యవసాయరంగానికి ప్రాధాన్యం
గ్రామాల్లోనే కొనుగోలు కేంద్రాల ఏర్పాటు నిర్ణయం గొప్ప విషయం
రైతులపై ప్రేమకు ఇది నిదర్శనం
సీఎం, మంత్రి చొరవతో పొలాలకు గోదావరి జలాలు
జడ్పీ చైర్పర్సన్ వేలేటి రోజాశర్మ
చిన్నకోడూరు, మార్చి 31 : సీఎం కేసీఆర్ రైతు పక్షపాతి అని, రైతుల కష్టసుఖాలు తెలిసిన వ్యక్తని, రైతు సంక్షేమ ప్రాధాన్యంగా ప్రతి బడ్జెట్లోనూ సింహాభాగం నిధులు వ్యవసారంగానికి కేటాయిస్తూ రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నారని జడ్పీ చైర్పర్సన్ వేలేటి రోజాశర్మ అన్నారు. చిన్నకోడూరు మండలం సలెంద్రిలో గోదావరి జలాలతో నిండుకున్న ఒడిసెల చెరువు వద్ద బుధవారం సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావు ఫ్ల్లెక్సీలకు రైతులు కలిసి గోదావరి నీటితో జలాభిషేకం, క్షీరాభిషేకం చేశారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం ఎంపీపీ కూర మాణిక్యరెడ్డితో కలిసి మాట్లాడారు. దేశంలో రైతు వ్యతిరేక చట్టాలు తీసుకువచ్చి ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తుంటే, సీఎం కేసీఆర్ 6408 కొనుగోలు కేంద్రాలను గ్రామాల్లో ఏర్పాటు చేస్తామని నిర్ణయం తీసుకోవడం రైతులపై సీఎం కేసీఆర్కు ఉన్న ప్రేమకు నిదర్శమన్నారు.
రైతుబంధు, రైతుబీమా పథకాలు తీసుకు వచ్చి వ్యవసాయరంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చిన ఘనత సీఎం కేసీఆర్దే అన్నారు. ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టి రాష్ర్టాన్ని సస్యశ్యామలం చేస్తున్నారన్నారు. రాబోయే యాసంగి నాటికి అన్ని చెరువులకు నీళ్లుపోయేలా కాల్వలు పూర్తిచేయడానికి మంత్రి హరీశ్రావు అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. సిద్దిపేట నుంచి ఇల్లంతకుంట వరకు నాలుగు వరుసల రహదారి నిర్మాణంతో రైతాంగానికి, పర్యాటకులకు ఉపయోగకరంగా మారనుందని జడ్పీ చైర్పర్సన్ రోజాశర్మ అన్నారు. ఈ రహదారి నిర్మాణంతో పాటు డివైడర్తో కూడిన లైటింగ్ ఏర్పాటు చేయాలనే విషయంపై మంత్రి తన్నీరు హరీశ్రావును కోరగా.. సానుకూలంగా స్పందించారని మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.
చిన్నకోడూరు మండలం మీదుగా ఓ పక్క రాజీవ్ రహదారి, మరో పక్క సిరిసిల్లా మీదుగా వచ్చే జాతీయ రహదారి, మధ్యలో చిన్నకోడూరు మండల కేంద్రాన్ని, ఇల్లంతకుంట మండల కేంద్రంతో పాటు అల్లీపూర్, పెద్దకోడూరు, లింగారెడ్డిపల్లి గ్రామాలను కలుపుతూ నిర్మించే నాలుగు వరుసల రహదారితో మండలాల రూపురేఖలే మారిపోనున్నాయని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ మాణిక్యరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ కాముని శ్రీనివాస్, వైస్ ఎంపీపీ కీసరి పాపయ్య, సొసైటీ చైర్మన్లు సదానందంగౌడ్, కనకరాజు, డీసీసీబీ జిల్లా డైరెక్టర్ రామచంద్రం, ఏఎంసీ వైస్ చైర్మన్ రవీందర్రెడ్డి, మైలారం సర్పంచు కాల్వ ఎల్లయ్య, మెట్పల్లి ఉప సర్పంచు శంకర్, నాయకులు వినీత్రెడ్డి, భూంరెడ్డి, మధు, మొండయ్య, భాస్కర్, కుమార్ తదితరులు ఉన్నారు.
ఇవి కూడా చుడండి
ఎస్సీల ఆర్థికాభివృద్ధి కోసమే బర్రెల పంపిణీ
జానారెడ్డితో అభివృద్ధి శూన్యం : మంత్రి తలసాని