పెద్దపల్లి : ఎస్సీల ఆర్థికాభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఎస్సీ సంక్షేమ శాఖ అధ్వర్యంలో పైలట్ ప్రాజెక్ట్ కింద బర్రెలు పంపిణీ చేస్తున్నదని ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు.
ఈ మేరకు బుధవారం పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో పర్యటించిన ఆయన, మల్లాపూర్లో ఎస్సీ (మాల), ధర్మారంలో స్వర్ణకారుల కమ్యూనిటీ భవన నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు.
అనంతరం దొంగతుర్తిలో 8 గ్రామాలకు చెందిన 32 మంది ఎస్సీ లబ్ధిదారులకు పైలట్ ప్రాజెక్టు కింద రూ.కోటి 28 లక్షల విలువైన బర్రెలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి ఈశ్వర్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు పైలట్ ప్రాజెక్ట్ కింద ఎస్సీలకు బర్రెల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టామని, పాల విక్రయాల ద్వారా ఆర్థికంగా ఎదగవచ్చునని తెలిపారు.
ఎస్సీ కార్పొరేషన్ రుణాల కోసం ఇప్పటి వరకు 1,75,000 దరఖాస్తులు వచ్చాయని ఆయన వివరించారు.
కార్యక్రమంలో పెద్దపల్లి ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రాజేశ్వరి, జిల్లా పశుసంవర్థక శాఖ అధికారి నారాయణ, ఆర్డీవో శంకర్ కుమార్, జడ్పీటీసీ పూస్కూరు పద్మజ, ఎంపీడీఓ జయశీల, తదితరులు పాల్గొన్నారు.