నల్లగొండ/హాలియా : సుదీర్ఘకాలం మంత్రిగా ఉన్నప్పటికీ తన సొంత ఊరు అనుముల గ్రామ అభివృద్ధిని కుందూరు జానారెడ్డి పట్టించు కోలేదు.
అతడిని తిరిగి గెలిపిస్తే ఎలాంటి ఉపయోగం ఉండదని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బుధవారం నాగార్జున సాగర్ నియోజకవర్గ పరిధిలోని అనుముల గ్రామం, హాలియా పట్టణాల్లో టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ను గెలిపించాలని కోరుతూ మంత్రులు తలసాని, మహమూద్ అలీ విస్తృత ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ.. సాగర్ నియోజకవర్గ ప్రజలకు ఏం చేశారో ప్రజలకు చెప్పే ధైర్యం లేక తన ఓటమి తప్పదనే భయంతో జానారెడ్డి ఉన్నారని పేర్కొన్నారు. అందుకోసమే నీతి వ్యాఖ్యలు వల్లిస్తున్నారని విమర్శించారు.
కాంగ్రెస్ కు ఓటేస్తే ఎలాంటి ఉపయోగంలేదని, ఎవరు ఆ పార్టీని నమ్మడం లేదని పేర్కొన్నారు. వెనుకబడిన వర్గానికి చెందిన యువకుడు, విద్యావంతుడు భగత్ కు ఓటేసి గెలిపిస్తే నాగార్జునసాగర్ నియోజకవర్గంలో సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని, అన్ని రంగాలలో అభివృద్ధి సాదిస్తుందని చెప్పారు.
అనేక ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాడిన చరిత్ర దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య కు ఉందన్నారు. ఆయన వారసుడు భగత్ ను అత్యధిక మెజారిటీ తో గెలిచేలా ఆశీర్వదించాలని కోరారు. ప్రచారంలో ఎమ్మెల్యే కోరుకంటి చందర్, భగత్ తల్లి నోముల లక్ష్మి పాల్గొన్నారు.