నిజామాబాద్ సిటీ, సెప్టెంబర్ 15 : మోక్షగుండం విశ్వేశ్వరయ్యను ప్రతి విద్యార్థి ఆదర్శంగా తీసుకోవాలని ట్రైనీ ఐఏఎస్ మకరంద్ సూచించారు. నిజామాబాద్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో బుధవారం ఇంజినీర్స్ డేను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మకరంద్, గౌరవ అతిథిగా మహేశ్ బిగాల హాజరై విశ్వేశ్వరయ్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ట్రైనీ ఐఏఎస్ మాట్లాడుతూ.. విద్యార్థులు పట్టుదలతో చదివి ఉన్నతస్థాయికి ఎదగాలని సూచించారు. అనంతరం మహేశ్ బిగాల మాట్లాడుతూ.. తానూ ఇదే కళాశాలలో డిప్లొమా పూర్తిచేసినట్లు గుర్తుచేశారు. ఇంజినీరింగ్ చదివి విదేశాల్లో యూనివర్సిటీని స్థాపించానని తెలిపారు. కృష్ణమూర్తి బిగాల ట్రస్ట్ నుంచి కళాశాలలోని బ్రాంచ్ టాపర్లకు రూ.10వేల చొప్పున, ఈసెట్ స్టేట్ టాపర్కు రూ.25వేల ప్రోత్సాహకం అందజేయనున్నట్లు ప్రకటించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ శ్రీరాంకుమార్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.