నీలగిరి, ఏప్రిల్ 13 : గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్న నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు నల్లగొండ జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి తెలిపారు. బుధవారం ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. జిల్లాలో గంజాయి రవాణాపై నిఘా ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున తనిఖీలు చేస్తున్నట్లు ఎస్పీ వివరించారు. కట్టంగూర్, మిర్యాలగూడ పరిధిలో పోలీసుల తనిఖీల్లో గంజాయి రవాణా చేస్తున్న ఏడుగురు నిందితులను అదుపులోకి తీసుకొని వారి నుంచి 3.5 కిలోల గంజాయి, బైక్ను సీజ్ చేసి నట్లు చెప్పారు. ఇందులో ముగ్గురు బాల నేరస్తులు ఉన్నారని పేర్కొన్నారు. గతనెల 28న మిర్యాలగూడ పాత బీఎడ్ కాలేజీ సమీపంలో గంజాయి అమ్మేందుకు ప్రయత్నిస్తున్న పాత నేరస్తుడు రామ్ సాయి కిరణ్ను పట్టుకొని అతడి వద్ద నుంచి అరకేజీ గంజాయిని స్వాధీనం చేసుకున్నామన్నారు.
అతడిని విచారణ చేయగా మోతే ఈశ్వర్, శిరబోయిన శ్రీనివాస్, రామ్రాకేశ్, పులిజాల సాయి మిర్యాలగూడలో గంజాయి అమ్ముతున్నట్లు తెలియడంతో బుధవారం వారిని అదుపులోకి తీసుకొని 2.5 కిలోల గంజాయి సీజ్ చేసినట్లు చెప్పారు. నిందితుల్లో ఒకరైన ఈశ్వర్ ఆరునెలల క్రితం సూర్యాపేటకు వెళ్లి గణేశ్, వికాస్ ద్వారా కుల్ఫీ అనే వ్యక్తిని పరిచయం చేసుకున్నాడు. కుల్ఫీ ఆంధ్రా నుంచి గంజాయి తీసుకొచ్చి సూర్యాపేటలో అమ్ముతుంటాడు. ఈశ్వర్, రామ్ రాకేశ్, పులిజాల సాయి కూడా మార్చిలో కుల్ఫీ వద్ద మూడు కిలోల గంజాయి కొనుగోలు చేశారు. రామ్ రాకేశ్ తన వద్ద ఉన్న రెండు కేజీల గంజాయి నుంచి రామ్ సాయికిరణ్కు అరకిలో, పులిజాల సాయికి, శిరబోయిన శ్రీనివాస్కు 250 గ్రాముల చొప్పున విక్రయించాడు.
సూర్యాపేటకు చెందిన తంగెళ్లపల్లి కిరణ్, పర్వతం సురేశ్, సౌడోజు సాయి స్నేహితులు. కిరణ్, సురేశ్ హైదరాబాద్లో ప్రైవేటు ఉద్యోగం చేస్తుండగా సాయి ఇంటర్ చదువుతున్నాడు. కిరణ్, సురేశ్ సాయి ద్వారా సూర్యాపేటలోని కుల్ఫీ వద్ద కిలో గంజాయి కొనుగోలు చేసి బైక్పై హైదరాబాద్కు వెళ్తుండగా కట్టంగూర్ మండలం మాణిక్యాలమ్మగూడెం వద్ద పోలీసులు పట్టుకున్నారు. గంజాయి కేసుల్లో మొత్తం 8 మంది నిందితులు ఉండగా అందులో కుల్ఫీ పరారీలో ఉన్నాడు. మిగతా ఏడుగురిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్పీ తెలిపారు. నిందితులను చాకచక్యంగా అరెస్ట్ చేసిన డీఎస్పీలు వెంకటేశ్వర్రెడ్డి, వెంకటేశ్వర్రావు, సీఐ రాఘవరావు, శ్రీనివాస్, ఎస్ఐలు విజయ్కుమార్, సుధీర్ను ఎస్పీ అభినందించారు.