సమైక్య పాలనలో నీరుగారిన ప్రభుత్వ విద్య స్వరాష్ట్రంలో జవసత్వాలు నింపుకొంటున్నది. ప్రభుత్వ
పాఠశాలలపై విద్యార్థులు, తల్లిదండ్రుల్లో రోజురోజుకూ విశ్వసనీయత పెరుగుతున్నది. నాణ్యమైన విద్య,
మౌలిక వసతులు, సన్న బియ్యంతో భోజనం, ఉచితంగా పుస్తకాలు, ప్రైవేటుకు దీటుగా ఉత్తమ ఫలితాలు, ప్రైవేటు పాఠశాలల ఫీజులు అందరినీ ఆలోచింపజేస్తున్నాయి. కొవిడ్ పరిస్థితుల్లో పిల్లలు విద్యా సంవత్సరం నష్టపోకుండా కార్పొరేట్కు దీటుగా ప్రభుత్వం ఆన్లైన్ తరగతులు, టీ-శాట్, దూరదర్శన్ పాఠాలు నిర్వహిస్తుండడం మరింత నమ్మకాన్ని పెంచింది. దాంతో ప్రైవేట్ స్కూళ్ల నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లకు క్యూ కడుతున్నారు. ఈ విద్యా సంవత్సరం ఇప్పటికే ఉమ్మడి జిల్లావ్యాప్తంగా
ప్రభుత్వ పాఠశాలల్లో 35వేల మందికిపైగా విద్యార్థులు కొత్తగా చేరారు.
ఒకటో తరగతిలో అడ్మిషన్లు
నల్లగొండ 5,590
సూర్యాపేట 3,593
యాదాద్రి 1,320
ఆరో తరగతిలో అడ్మిషన్లు
నల్లగొండ 4,867
సూర్యాపేట 2,981
యాదాద్రి 1,679
ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా బడిబాట కార్యక్రమం లేకుండానే విద్యార్థుల ప్రవేశాల సంఖ్య పెరుగుతుండటం గమనార్హం. ప్రభుత్వ బడిలో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులకు తోడు పలు సౌకర్యాలు కల్పించి గుణ్మాతక విద్య అమలు చేస్తుండడం ఇందుకు దర్పణం పడుతున్నది. మరో వైపు ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల నుంచి విద్యార్థులు సమీపంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్ తీసుకుంటున్నారు.
విశేష స్పందన…
ఉమ్మడి జిల్లాలో ఈ విద్యా సంవత్సరం ఇప్పటి వరకు 1నుంచి 10వతరగతి వరకు 35,452 మంది కొత్తగా అడ్మిషన్ తీసుకున్నట్లు విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. నల్లగొండ జిల్లాలోని 1,486 పాఠశాలల్లో 17,682 మంది విద్యార్థులు చేరారు. అదే విధంగా సూర్యాపేట జిల్లాలో 950 ప్రభుత్వ పాఠశాలల్లో 10,530 మంది చేరగా, యాదాద్రి భువనగిరి జిల్లాలో 712 ప్రభుత్వ పాఠశాలల్లో 7,540 విద్యార్థులు ప్రవేశాలు పొందారు. అయితే, నల్లగొండ జిల్లాలో 1వ తరగతిలోనే అత్యధికంగా 5,590, సూర్యాపేట జిల్లాలో 3,593, యాద్రాది భువనగిరి జిల్లాలో 1,320 మంది విద్యార్థులు నూతన అడ్మిషన్లు తీసుకోవడం గమనార్హం. అదే విధంగా ప్రాథమిక పాఠశాల విద్యను పూర్తిచేసుకుని 6వ తరగతిలో ప్రభుత్వ పాఠశాలలో చేరిన విద్యార్థుల సంఖ్య సైతం అదే తరహాలో ఉండగా వీరిలో ఆరో తరగతిలోనే 4,867, సూర్యాపేట జిల్లాలో 2,981, యాదాద్రి భువనగిరి జిల్లాలో 1,679మంది ఉన్నారు.
కరోనా వేళలోనూ..
విద్యాశాఖాధికారులు, ఉపాధ్యాయులు, సీఆర్పీలు (క్లస్టర్ రిసోర్స్ పర్సన్స్) కాంప్లెక్స్ పాఠశాలల పరిధిలో ఇంటింటికీ వెళ్లి విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. ఆన్లైన్ తరగతులను సద్వినియోగం చేసుకునేలా చూడడంతోపాటు విద్యార్థుల భవిష్యత్తుపై భరోసా కల్పించారు.
ప్రభుత్వం కల్పిస్తున్న వసతులు, ఉపాధ్యాయుల పనితీరు వల్లే..
తమ పిల్లల భవిష్యత్కు ప్రభుత్వ పాఠశాలలు సరైన వేదిక అని విద్యార్థుల తల్లిదండ్రులు విశ్వసిస్తున్నారు. బడిబాట లేనప్పటికీ ఎంఈఓలు, ఉపాధ్యాయులు, సీఆర్పీలు ఇంటింటికీ వెళ్లి తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. ఇప్పటి వరకు నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో కొత్తగా చేరిన విద్యార్థుల సంఖ్య అందుకు నిదర్శనం. ఆన్లైన్ విద్యాబోధన గురించి నేను కూడా జిల్లా వ్యాప్తంగా పర్యటించి తల్లిదండ్రులను, విద్యార్థులను కలిసి అవగాహన కల్పించాను. వీటన్నింటికి తోడుగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు బాసర ట్రిపుల్ ఐటీలో సీటు సాధించే అవకాశం ఉన్నది. అదే స్థాయిలో నేషనల్ స్కాలర్ షిప్ అందుకునే అవకాశం కూడా ఉంది.