షేక్పేట్ : బస్తీలలో సుస్తీని దూరం చేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బస్తీ దవాఖానలను ఏర్పాటు చేసిందని, ఇందులో ప్రజలకు అన్నీ రకాల ప్రాధమిక వైద్య సౌకర్యాలను కల్పించిందని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు.
శుక్రవారం జూబ్లీహిల్స్ నియోజకవర్గం షేక్పేట్ డివిజన్ రాజీవ్గాంధీ కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేసిన బస్తీ దవాఖాన ను స్థానిక ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్తో కలిసి మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ముందుగా కార్యక్రమానికి విచ్చేసిన మంత్రి కేటీఆర్కు జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ మొక్కను అందించి సాదర స్వాగతం పలికారు.
అనంతరం బస్తీ దవాఖానను మంత్రి రిబ్బన్ కట్చేసి ప్రారంభించారు. దవాఖానలోకి వెళ్లగానే సిబ్బందిని వైద్య సేవల గురించి వాకబు చేశారు. సిబ్బందిని ప్రశంసించిన మంత్రి ఏవైనా అవసరం ఉంటే తమ దృష్టికి తేవాలని సూచించారు. అనంతరం రోగుల పరీక్షల కోసం ఏర్పాటు చేసిన ల్యాబ్ను,చికిత్స గదిని పరిశీలించారు.
ఈ క్రమంలో వైద్య సిబ్బంది సార్ ఫోటో అని కోరడంతో వారితో ఫోటోలు దిగారు. దవాఖాన నుంచి బయటకు వచ్చి దివ్యాంగులను కలిసి వారితో ఫోటోలు దిగారు. చివరగా మొబైల్ వ్యాక్సిన్ వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించడానికి వైద్య సిబ్బంది కృషి చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ ,ఆయుష్ కమిషనర్ వర్షిని, డిఎంఅండ్ హెచ్ఓ డాక్టర్ వెంకటి, డిప్యూటీ డిఎంఅండ్హెచ్ఓ డాక్టర్ అనూరాధ, కార్పొరేటర్లు బాబాఫసియుద్దీన్, రషీద్ ఫర్హజుద్దీన్, రాజ్కుమార్ పటేల్, దేదిప్య, ఖైరతాబాద్ జోనల్ కమీషన్ రవికిరణ్, డిప్యూటీ కమీషనర్ సేవాఎస్లావత్ల తదితరులు పాల్గొన్నారు.