పుల్కల్ రూరల్, సెప్టెంబర్ 26 : ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు వారం రోజులుగా సింగూరు ప్రాజెక్టులోనికి భారీగా ఇన్ఫ్లో కొనసాగుతుంది. దీంతో అధికారులు శనివారం 5 గేట్లను తెరవడంతో ఇన్ఫ్లో కాస్త తగ్గింది. ఆదివారం ఉదయం 10:30 గంటలకు 5వ నంబర్ గేటును మూసివేసి, 6, 9, 11, 14వ నంబర్ గేట్ల ద్వారా 44,606 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నామని అధికారులు తెలిపారు. మండల పరిధిలోని అన్ని గ్రామాల్లో కలిపి 140 చెరువులు, కుంటలు ఉన్నామయని, కెనాల్ ఎడమ కాల్వ ద్వారా ఇప్పటి వరకు సుమారుగా 60 చెరువుల వరకు నిండుకున్నాయని ఏఈ మహేశ్ తెలిపారు. మిగతా 40 చెరువులను కూడా కెనాల్ కాల్వ ద్వారా నింపుతామన్నారు. ఈ సారి యాసంగికి ఎలాంటి ఢోకా లేదని, రైతులు అధైర్య పడకుండా పంటలు పండించుకోవచ్చన్నారు.
ప్రాజెక్టు వద్ద పర్యాటకుల సందడి..
ప్రాజెక్టులోనికి భారీగా వరద వచ్చి చేరడంతో అధికారులు 5గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదుతున్నారు. దీంతో సింగూర్కు పర్యాటకుల తాకిడి పెరిగింది. ప్రాజెక్టును తిలకించేందుకు ఉమ్మడి మెదక్ జిల్లాతో పాటు జంట నగరాలు, పక్క జిల్లాల నుంచి ప్రజలు ఆదివారం పెద్ద ఎత్తున తరలివచ్చారు. సెల్ఫీలు దిగుతూ ఉల్లాసంగా గడిపారు. ప్రాజెక్టు ఆవరణలో చిరు వ్యాపారులు తయారు చేసే చేపల ఫ్రైకి డిమాండ్ ఏర్పడింది. ప్రాజెక్టులో పట్టే చేపలు కావడంతో మంచి రుచికరంగా ఉంటాయని పర్యాటకులు క్యూలో నిలబడి మరీ ఫ్రై చేసిన చేపలను కొనుగోలు చేశారు. ప్రాజెక్టు వద్ద పర్యాటకులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా పోలీసులు, ప్రాజెక్టు అధికారులు తగిన చర్యలు చేపట్టారు.