గ్రామ పంచాయతీల్లో పారదర్శకతను పెంచే విధంగా రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీల్లో ఈ-ఆడిట్ వ్యవస్థను తీసుకువచ్చింది. గత ఏడాది ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆడిట్ నిర్వహించేందుకు పైలెట్ ప్రాజెక్టు కింద మెదక్ జిల్లాలో 20శాతం అంటే 95 గ్రామ పంచాయతీలను ఎంపిక చేశారు. దీంతో గ్రామ పంచాయతీల్లో తొలిసారి ఆన్లైన్ ద్వారా ఆడిట్ నిర్వహించారు. గతేడాది జిల్లాలో 95 గ్రామ పంచాయతీల్లో నిర్వహించిన ఆడిట్ విజయవంతమైంది. ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా సంబంధిత అధికారులు ఆడిట్ను పూర్తి చేశారు. ఈ ఏడాది జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో ఈ-ఆడిట్ విధానం అమలు చేస్తున్నారు. మెదక్, సెప్టెంబర్ 24: మెదక్ జిల్లాలో 469 గ్రామ పంచాయతీలున్నాయి. ఈ ఏడాది అన్ని పంచాయతీల్లో ఈఆడిట్ విధానం అమలు చేస్తున్నారు. గతేడాది 20 శాతం పంచాయతీల్లో దీనిని అమలు చేశారు. అది మంచి ఫలితాలు ఇవ్వడంతో ఈ ఏడాది వంద శాతం ఈ-ఆడిట్ కోసం అధికారులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 315 గ్రామ పంచాయతీల్లో ఈఆడిట్ పూర్తి చేశారు. వీటికి సంబంధించి దాదాపు 200 గ్రామ పంచాయతీల వివరాలు అన్నింటినీ ఆన్లైన్లో నమోదు చేశారు. మిగతా గ్రామాల్లో ఈఆడిట్ పనులు ప్రస్తుతం పురోగతిలో ఉన్నాయి. జూన్ నెలలో మొదలైన ఈఆడిట్ ప్రక్రియ అక్టోబర్ వరకల్లా పూర్తి చేయాల్సి ఉంది. ఇందుకోసం ఆడిట్ అధికారులు ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళ్లే పనిలో ఉన్నారు.
పంచాయతీల్లో ఆడిట్ ఇలా..
గ్రామ పంచాయతీల్లో ఏ నిధులతో ఏ పనులు చేశారు..? అందుకు సంబంధించిన ఎంబీ రికార్డులు పరిశీలిస్తారు, జీపీల్లో నిధుల వినియోగానికి సంబంధించిన రికార్డులను పరిశీలిస్తారు. ప్రభుత్వం నుంచి విడుదల చేసిన నిధులతో గ్రామ పంచాయతీల్లో ఏఏ పనులు చేశారో తెలుసుకుంటారు, నిధుల వినియోగానికి సంబంధించిన రికార్డులు సక్రమంగా ఉన్నాయా..? లేదా అన్న విషయాలను స్పష్టం చేస్తారు. ఆ తర్వాత గ్రామాల వారీగా రిపోర్టు తయారు చేసి ఆడిట్ అధికారి నుంచి టీం లీడర్కు, ఆ తర్వాత జిల్లా అడిట్ అధికారికి పంపిస్తారు. గ్రామ పంచాయతీల్లో రికార్డులు లేని వాటిని రిమార్కు రాసి పెడుతారు, ఏమైనా అభ్యంతరాలు ఉంటే వాటికి సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుంది. దీనికి కొంత సమయం ఇస్తారు. గడువులోగా హార్డ్కాపీలతో పాటు వివరాలు అందజేయాల్సి ఉంటుంది.
జిల్లాలోని అన్ని జీపీల్లో
ఈ-ఆడిట్ అమలు చేస్తున్నాం..
జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో ఈ సంవత్సరం ఈఆడిట్ అమలు చేస్తున్నాం. గ్రామ పంచాయతీల్లో పారదర్శకత కోసం ప్రభుత్వం ఈ ఆడిట్ విధానం తీసుకువచ్చింది. జిల్లాలోని 469 గ్రామ పంచాయతీల్లో ఈఆడిట్ ప్రక్రియ కొనసాగుతోంది. జూన్ నెలలో మొదలైన ఈఆడిట్ ప్రక్రియ అక్టోబర్ వరకు పూర్తి చేయాల్సి ఉంది. ఈ ఏడాది వంద శాతం ఈ-ఆడిట్ కోసం అధికారులు కృషి చేస్తున్నారు. ఇప్పటి వరకు 315 గ్రామ పంచాయతీల్లో పూర్తి చేశాం.