సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు కాసుల గలగల కరోనాతో అన్నిరంగాలు కుదేలయ్యాయి. ఈ సమయంలో రియల్ ఎస్టేట్ రంగం మరింత ఇబ్బందులకు గురైంది. ప్రస్తుతం కొవిడ్-19 టీకా అందజేస్తుండడం, ప్రజల్లో వైరస్ వ్యాప్తిపై వచ్చిన అవగాహనతో మార్కెట్ కళకళలాడుతూ ఇప్పుడిప్పుడే ఆయా రంగాలు పుంజుకుంటున్నాయి. ప్రభుత్వం ఇటీవల భూముల విలువ, స్టాంపు డ్యూటీ చార్జీలను పెంచడంతో రిజిస్ట్రేషన్, స్టాంపుల శాఖకు కాసుల వర్షం కురిపిస్తున్నది. ప్రస్తుతం రియల్ రంగం పుంజుకొని క్రయవిక్రయాలు జరుగుతుండడంతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు ఆదాయం పెరిగింది. భూముల క్రయవిక్రయాలు పెరిగితే మరింత ఆదాయం సమకూరుతుందని ఆ శాఖ అధికారులు భావిస్తున్నారు.
మెదక్, సెప్టెంబర్ 19: పెరిగిన భూ విలువ, స్టాంపు డ్యూటీ ఫీజులతో రిజిస్ట్రేషన్, స్టాంపుల శాఖకు కాసుల వర్షం కురిపిస్తోంది. కరోనాతో ఏడాది కాలంగా కుదేలైన రియల్ రంగం ఇప్పుడు పుంజుకోవడంతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఖజానా గలగలలాడుతోంది. గతంలో మెదక్ జిల్లా వ్యాప్తంగా నెలకు సగటున సుమారుగా రూ. 50 లక్షల వరకు ఆదాయం నమోదయ్యేది. కానీ, పెరిగిన చార్జీలతో ప్రస్తుతం పదిహేను రోజుల్లోనే రూ. కోటి మేర ఆదాయం సమకూరడం విశేషం. కరోనా ముప్పు తొలగిపోయి భూముల క్రయవిక్రయాలు ఊపందుకుంటే ఈ ఆదాయం మరింత పెరుగుతుందని భావిస్తున్నారు.
మెదక్ జిల్లాలో నాలుగు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు..
మెదక్ జిల్లాలో మెదక్, నర్సాపూర్, తూప్రాన్, రామాయంపేట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి. ఇటీవల మెదక్ జిల్లాలో రియల్ రంగం పుంజుకుంది. కరోనా వేవ్ తగ్గితే రియల్ ఎస్టేట్ వ్యాపారం మరింత జోరందుకుని శాఖకు దండిగా ఆదాయం సమకూరనుంది. మెదక్ జిల్లాలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖకు, రిజిస్ట్రేషన్లు, స్టాంప్ డ్యూటీ, ఇతర లావాదేవీల ద్వారా ఆదాయం భారీగా పెరిగింది. మెదక్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో జూన్లో రూ. 41,99,860, జూలైలో రూ.67,79,255, ఆగస్టులో రూ.45,25,335 ఆదాయం రాగా, తూప్రాన్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో జూన్లో రూ.1,48,22,000, జూలైలో రూ.1,39, 73,000, ఆగస్టులో రూ.1,21,32,000 ఆదాయం వచ్చింది. నర్సాపూర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో జూన్లో రూ.7,79,780, జూలైలో రూ.10,98, 710, ఆగస్టులో రూ.23, 63,530 ఆదాయం రాగా, రామాయంపేట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో జూన్లో రూ.43,54,896, జూలైలో రూ.34,83,846, ఆగస్టులో రూ.58,79,285 ఆదాయం వచ్చింది.
స్టాంపు డ్యూటీ పెరగడంతో..
గతంలో స్టాంపు డ్యూటీ 4 శాతం, ట్రాన్స్ఫర్ డ్యూటీ 0.5 శాతం, రిజిస్ట్రేషన్ ఛార్జీలు 1.5 శాతం, మొత్తంగా 6 శాతం మార్కెట్ విలువపై రిజిస్ట్రేషన్ ఫీజుగా చెల్లించే వారు. గత నెలలో ప్రభుత్వం స్టాంపు డ్యూటీని 5.5 శాతానికి పెంచింది. మిగతావి అలాగే ఉన్నా, మొత్తంగా రిజిస్ట్రేషన్ ఛార్జీలు 7.5 శాతానికి పెరిగాయి. ఈసారి రిజిస్ట్రేషన్ ఛార్జీలతో పాటు భూముల మార్కెట్ విలువను కూడా ప్రభుత్వం పెంచింది. 2013 తర్వాత మార్కెట్ విలువను పెంచకపోవడంతో ఇప్పుడు వాటిని 20 శాతం నుంచి 50 శాతం వరకు పెంచింది. పెరిగిన భూ విలువ, రిజిస్ట్రేషన్ ఫీజుతో ఇదే స్థాయిలో ఆదాయం కూడా పెరుగుతోంది. ప్రభుత్వం భూ విలువ, స్టాంప్ డ్యూటీ ఫీజు, పెంచిన తర్వాత జిల్లా స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖకు జూన్ నెల నుంచి ఆగస్టు వరకు రూ. కోట్ల ఆదాయం సమకూరింది.
ఆదాయం పెరుగుతున్నది..
ప్రభుత్వం భూముల విలువ, స్టాంప్ డ్యూటీ ఫీజు పెంచిన తర్వాత రిజిస్ట్రేషన్ల శాఖకు ఆదాయం పెరుగుతోంది. మెదక్ జిల్లాలో నాలుగు సబ్ రిజిస్ట్రార్ కార్యాయాలు ఉన్నా యి. కరోనా భయం తగ్గి, క్రయవిక్రయాలు పెరిగితే శాఖకు మరింత ఆదాయం రానున్నది. స్లాట్ బుకింగ్, ఫీజుల చెల్లింపులన్నీ ఆన్లైన్ ద్వారానే జరుగుతున్నాయి.
-రఘుపతి, సబ్ రిజిస్ట్రార్ మెదక్