ప్రముఖ శైవ క్షేత్రం.. వెయ్యేండ్ల చరిత్ర ఉన్న బొంతపల్లి వీరభద్రుడి సన్నిధానానికి కొత్తందాలు రానున్నాయి. ఆలయ కమిటీ ధర్మకర్తలు, బొంతపల్లి, వీరన్నగూడెం పంచాయతీ పాలకవర్గాల ప్రత్యేక చొరవతో రూ.4.50కోట్ల పనులు ప్రారంభం కాగా, అవి పూర్తి కావస్తున్నాయి. క్షేత్రానికి మరింత వైభవం తెచ్చేందుకు నలుదిక్కులా రాజగోపురాల నిర్మాణాలు జరుగుతున్నాయి. ప్రాకారం, సాలారం నిర్మాణాలు చివరి దశలో ఉన్నాయి. ఈశాన్యం దిక్కున కోనేరు, అద్దాల మండపం, ఆలయ ప్రాంగణంలో నేలపై చలువరాతితో అందంగా తయారవుతున్నాయి. కార్తీక మాసంలో పనులు అన్ని పూర్తి చేసి, ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి కృషితో దేవాదాయ శాఖ మంత్రి చేతుల మీదుగా ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
గుమ్మడిదల, సెప్టెంబర్ 18: దక్షుడిని సంహరించడం కోసం పరమ శివుడు జటా జూటం నుంచి వీరభద్రుడు జన్మించాడు. దక్షుడిని సంహరించిన అనంతరం వీరభద్రుడు అనేక ప్రదేశాల్లో ఆవిర్భవించారు. అలా ఆవిర్భంచిన ప్రాచీనమైన క్షేత్రాల్లో బొంతపల్లి-వీరన్నగూడెంలో సమీపంలో వెలిసిన వీరభద్రస్వామి దేవాలయం ఒకటి. సంగారెడ్డి జిల్లాలోని సుప్రసిద్ధ శైవక్షేత్రాల్లో ఒక్కటైన బొంతపల్లి భద్రకాళీ సమేత వీరభద్రస్వామి ఆలయానికి వెయ్యి ఏండ్ల చరిత్ర ఉంది. భక్తుల కోరికలు తీర్చే కొంగు బంగారంగా ఇక్కడి వీరభద్రస్వామి వెలుగొందుతున్నారు. స్వామి వారిని దర్శించుకోవడానికి మహారాష్ట్ర, కర్ణాటక నుంచే కాకుండా జంటనగరాలైన సికింద్రాబాద్ – హైదరాబాద్ నుంచి భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు. స్వయంభూగా వెలుగొందుతున్న వీరభద్రస్వామి వారి దేవాలయాన్ని ఆగమశాస్త్రం ప్రకారం నలుదిక్కుల రాజగోపురాలు, సాలారం, ప్రాకారాల నిర్మాణాలకు ఆలయ కమిటీ చైర్మన్ గటాటి భద్రప్ప ఆధ్వర్యం లో శ్రీకారం చుట్టారు. సుమారు రూ.నాలుగున్నర కోట్లతో నిర్మాణాలను చేపట్టారు. రెండేండ్లుగా వీరభద్రస్వామి దేవాలయానికి దక్షిణ, పడమర, ఉత్తర దిక్కుల రాజగోపురాలను నిర్మిస్తున్నారు. ఈ నిర్మాణాలు ప్రస్తుతం పూర్తి కావచ్చాయి. కాగా, 2000 సంవత్సరంలో అప్పటి ప్రస్తుత చైర్మన్ గటాటి భద్రప్ప తూర్పు దిక్కున రాజగోపురాన్ని భక్తుల విరాళాలతో నిర్మించారు. ఆగమశాస్త్రం ప్రకారం మరో మూడు దిక్కుల రాజగోపురాలను నిర్మాణం చేపట్టాలని దేవాలయ కమిటీ ధర్మకర్తలు, బొంతపల్లి, వీరన్నగూడెం పంచాయతీ పాలకవర్గంతో కలిసి నూతన వైభవాన్ని తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నారు. ఒక్కో రాజగోపురానికి సుమారు రూ.25 నుంచి 35 లక్షల ఖర్చు కానున్నదని అంచనా వేశారు. ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి సహకారంతో రాజగోపురాల నిర్మాణం చేస్తున్నారు. ఈ దేవాలయానికి నలుదిక్కుల రాజగోపురాలు, సాలారం, ప్రాకారం పూర్తి అయితే భద్రకాళీ సమేత వీరభద్రస్వామి దేవాలయానికి నూతన వైభవం రానున్నది.
దేవాలయాన్ని సుందరంగా తీర్చిదిద్దుతాం..
బొంతపల్లి వీరభద్రస్వామి దేవాలయానికి వెయ్యేండ్ల చరిత్ర ఉన్నది. గతంలో ఈ దేవాలయం చిన్నదిగా ఉండేది. అప్పట్లో గ్రామస్తుల సహకారంతో గర్భగుడి, ప్రాకారం నిర్మించాం. దీనిపై దక్షయజ్ఞం చేస్తున్న చరిత్రతో కూడిన దేవతామూర్తుల విగ్రహాలను ఏర్పాటు చేయించాం. 2000 సంవత్సరంలో తూర్పు దిక్కున రాజగోపురాన్ని నిర్మించాం. ఆలయాన్ని మరింత సుందరంగా తీర్చిదిద్దడానికి పడమర, దక్షిణం, ఉత్తర దిక్కున కొత్తగా మూడు రాజగోపురాలను నిర్మిస్తున్నాం. ఈశాన్యం దిక్కున కోనేరు, అద్దాల మండపం, ఆలయ ప్రాంగణంలో నేలపై చలువరాతితో అందంగా తీర్చిదిద్దుతాం.