మహబూబ్నగర్, సెప్టెంబర్ 28 : ఎవరు ఎంత శ్రమించినా.. ఆదాయాన్ని పరిగణలోకి తీసుకుంటున్నారు. ప్రతి వ్యాపారంలోనూ పెట్టుబడి పోను రాబడిని లెక్కగడుతుంటాం. ఏండ్ల తరబడి వరి సాగుకు అలవాటుపడి.. ఆదాయ వనరుగా ఉన్న ఎన్నో పంటలను రైతులు సాగు చేయడం లేదు. ఈ క్రమంలో రైతులు లాభదాయక పంటల వైపు దృష్టి మరల్చేందుకు అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. ఈ నెల 24వ తేదీ నుంచి ప్రారంభమైన అవగాహన బుధవారంతో ముగియనున్నాయి. ఏడాదికేడాది వరి సాగు విస్తీర్ణం గణనీయంగా పెరుగుతూ వస్తున్నది. అందరూ వరి సాగు చేయడంతో పంట దిగుబడి పెరిగినప్పటికీ.. పెరిగిన ఖర్చులను పరిగణలోకి తీసుకుంటే నష్టపోవాల్సి వస్తున్నది. ఈ క్రమంలో పంట మార్పిడి చేసి ఇతర పంటలను కూడా సాగు చేయాలి. వేరుశనగ, జొన్న, శనగ, రాగి, పొద్దుతిరుగుడు, పెసర్లు, చిరుధాన్యాల పంటలను సాగు చేయాలని ప్రభుత్వం సూచిస్తున్నది.
ఇప్పటికే తెల్చిచెప్పిన కేంద్రం..
వరి సాగు తుది దశకు రావాలని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఈ మేరకు వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పిస్తున్నారు. రైతులకు లాభసాటిగా ఉండే పంటలను పండించాలని కేంద్రం కూడా ప్రకటించింది. తక్కువ పెట్టుబడితో రైతులకు అత్యధిక ఆధాయం సమకూర్చే పనిలో రాష్ట్ర ప్రభుత్వం నిమగ్నమైంది. తమ భూముల్లో ఏ పంటలను సాగు చేస్తే దిగుబడి పెరుగుతుందనే విషయాన్ని వ్యవసాయ విస్తరణ అధికారులతో చర్చించాల్సి ఉంటుంది.