పెనుబల్లి, ఏప్రిల్ 26: పల్లెలే దేశానికి పట్టుగొమ్మలని హితబోధ చేశారు భారత జాతిపిత బాపూ. అదే బాటను అనుసరించిన తెలంగాణ జాతిపతి కేసీఆర్ కూడా.. పల్లెలను ప్రకృతి కేంద్రాలుగా తీర్చిదిద్దారు. అందుకోసమే గత బీఆర్ఎస్ ప్రభుత్వం ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన.. రూ.లక్షల నిధులు వెచ్చించి ఊరూరా పల్లె ప్రకృతి కేంద్రాలను ఏర్పాటు చేశారు. వాటిల్లో ఔషధ గుణాలున్న మొక్కలు పెంచారు. పండ్లు, పూలు అందించే మొక్కలనూ నాటి పరిక్షించారు. వీటన్నింటికీ మించి పల్లె ప్రజలు ప్రకృతిని ఆస్వాదించేలా ప్రకృతి వనాలను పార్కులుగా తీర్చిదిద్దారు. పల్లెవాసులకు పరిశుభ్రమైన వాతావరణాన్ని, ఆనందరకమైన ఆహ్లాదాన్ని అందించారు. దీంతో గ్రామీణులు కూడా తమ తమ పల్లెల్లోని పల్లె ప్రకృతి వనాలను ఉదయం, సాయంత్రం వేళల్లో సందర్శించారు. వ్యాయామం కోసం వాకింగ్ చేస్తూ, ఆరోగ్యం కోసం ప్రకృతిని ఆస్వాదిస్తూ గడిపేవారు. కానీ గడిచిన నాలుగున్నర నెలలుగా పల్లె వనాలన్నీ ప్రకృతి విహీనంగా దర్శనమిస్తున్నాయి. నాటి కేసీఆర్ పాలనలో కళకళలాడిన పల్లె ప్రకృతి వనాలన్నీ నేటి కాంగ్రెస్ పాలనలో కళావిహీనమై కన్పిస్తున్నాయి. నాటి ప్రభుత్వం రూ.లక్షల నిధులు వెచ్చించి పల్లె పార్కులను నిర్మిస్తే.. నేటి ప్రభుత్వం ఆ పార్కుల పరిరక్షణను పక్కనపడేసింది. పార్కుల నిర్వహణను పట్టించుకోకపోవడం, మొక్కల సంరక్షణను గాలికి వదిలేయడంతో ఆ వనాలన్నీ నేడు అస్తవ్యస్తంగా దర్శనమిస్తున్నాయి. ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తుండడం, పల్లె వనాలను పట్టించుకోకపోవడం వంటి కారణాలతో పల్లె ప్రజలు కూడా అటువైపు వెళ్లడం లేదు. దీంతో ఇటు ప్రజలకు ఆహ్లాదం అందకపోగా.. ఇటు పార్కుల్లో పిచ్చి మొక్కలు పెరుగుతున్నాయి.
గత కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రకృతి వనాలను పల్లెల్లో విశేష ఆదరణ లభించింది. అప్పటి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కూడా ప్రత్యేక చొరవ తీసుకొని పార్కులను పర్యవేక్షించేవారు. పరిరక్షించేవారు. ఇందుకోసం ఏపీలోని కడియం వంటి సుప్రసిద్ధ నర్సరీలకు వెళ్లి ఔషధ గుణాలున్న అనేక మొక్కలను పెద్ద సంఖ్యలో వాహనాల్లో తెచ్చి నాటే వారు. అవి అద్భుతమైన ఆహ్లాదాన్ని పంచుతుంటే పల్లె ప్రజలు ప్రకృతిలో పరవశించిపోయేవారు. కానీ ప్రస్తుత ప్రభుత్వం పల్లె ప్రకృతి వనాలను పక్కనబెట్టింది. ప్రజలను ఆహ్లాదానికి దూరం చేసింది. ఇక గత ప్రభుత్వంలో కడియం వంటి సుప్రసిద్ధ నర్సరీల నుంచి దాల్చినచెక్క, బాధం, అడ్డసారం, అరటి, షుగరాకు, మామిడి, గిన్నె, ఎర్రుమద్ది, మందారం వంటి మొక్కలను తెచ్చిన నాటి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు వాటిని నర్సరీల్లో నాటి ప్రతి రోజూ నీళ్లు పోసేవారు. దీంతో అవి ఏపుగా పెరిగి ఆహ్లాదాన్ని అందించేవి. ప్రస్తుత ప్రభుత్వం పంచాయతీ సిబ్బందికి నర్సరీల పర్యవేక్షణ బాధ్యతల నుంచి తప్పించడంతో వాటి పర్యవేక్షణ దెబ్బతిన్నది. దీంతో ప్రస్తుతం అవి కోతులు, పందులు, పశువులకు నిలయాలుగా మారాయి. గత ప్రభుత్వం రూ.లక్షల నిధులు వెచ్చించి తీర్చిదిద్దిన ఈ పార్కులు ఈ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ప్రాభవం కోల్పోయాయి.
నాటి ప్రభుత్వంలో మేము రూ.లక్షలు వెచ్చించి పల్లె ప్రకృతి వనాలను తీర్చిదిద్దాం. గ్రామస్తులకు అప్పట్లో అవి ఎంతో ఆహ్లాదాన్ని అందించాయి. కానీ ఇప్పుడు ఆ పార్కుల్లో పూర్వ పరిస్థితి కనిపించడం లేదు. పంచాయతీలోని సిబ్బందిలో ఏ ఒక్కరినైనా కేటాయించి రోజూ నీళ్లు పోయించి, శుభ్రం చేయిస్తే పార్కులు పూర్వ వైభవాన్ని పొందుతాయి. దీంతో ప్రజలు ఆహ్లాదం కోసం, ఆరోగ్యం కోసం ఈ పల్లె ప్రకృతి వనాలకు వస్తారు. సాయంత్రం వేళల్లో ఇక్కడ కొద్దిసేపు సేదదీరుతారు.