ముషీరాబాద్: జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలని బీపీ మండల్ చేసిన సిఫార్సులకు అనుగుణంగా సీఎం కేసీఆర్ కేంద్రానికి ప్రతిపాదనలు పంపారని బీసీ కమిషన్ పూర్వ సభ్యుడు జూలూరు గౌరీశంకర్ తెలిపారు. జనాభా ప్రాతిపదికన అన్ని వర్గాలకు మేలు చేసేలా పంపిన ప్రతిపాదనలు కేంద్రం పరిశీలనలో ఉన్నాయన్నారు. “ఎందరో మాహానుభావుల మధుర స్మృతులతో” కార్యక్రమంలో భాగంగా బుధవారం ప్రముఖ ఉద్యమకారుడు బీపీ మండల్ జయంతి సభ చిక్కడపల్లి త్యాగరాయగానసభలో జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా విచ్చేసిన బీసీ కమిషన్ పూర్వ సభ్యుడు జూలూరు గౌరీశంకర్ మండల్ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తమిళనాడులో అమలు చేస్తున్న విధంగానే మన రాష్ట్రంలో మండల్ స్పూర్తిగా రిజర్వేషన్లు అమలు చేస్తానని సీఎం కేసీఆర్ శాసన సభలో ప్రకటించారని అన్నారు. బీసీల జీవితాల్లో సంపూర్ణమైన సామాజిక మార్పురావడానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. గానసభ అధ్యక్షుడు కళా జనార్థనమూర్తి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సంపాదకుడు బైసా దేవదాసు, రచయిత వడ్డెపల్లి కృష్ణ, టీవీ నటుడు మాణిక్ తదితరులు పాల్గొన్నారు.