నాడు సిరిసిల్లలో సాగునీటి కోసం తండ్లాట
లక్షలు వెచ్చించి బోర్లు వేసినా పడని నీళ్లు
నేడు కాళేశ్వర గంగతో పైపైకి భూగర్భ జలాలు
బావుల తవ్వకం వైపు రైతుల మొగ్గు
నీటి ఊటలను చూసి హర్షాతిరేకాలు
పల్లెల్లో మళ్లీ పాతరోజులు
సిరిసిల్ల రూరల్, ఏప్రిల్ 5: రాజన్న సిరిసిల్ల జిల్లా రైతులు బోరుబావుల తవ్వకాలను ఆపేసి బావులపై మొగ్గు చూపుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో చెరువులు నిండి మత్తళ్లు దూకడం, వాగులు ఉప్పొంగడంతో భూగర్భ జలాలు జిల్లాలో 6 మీటర్లకు పెరిగాయి. దీంతో పాత రోజుల మాదిరిగా మళ్లీ రైతులు బావుల తవ్వకాలను చేపడుతున్నారు. జిల్లాలో 26,345 వ్యవసాయ బావులు ఉండగా, కొత్తగా మూడు వేల వరకు బావులు తవ్వుతున్నారు. సుమారు 30 ఏళ్ల నుంచి భూగర్భ జలాలు పాతాళానికి వెళ్లడంతో బావులపై ఆశలు వదులుకొని, బోరుబావులు తవ్వుతూ వచ్చారు. అయితే వీటికి అధిక ఖర్చు వెచ్చించి అప్పులపాలయ్యారు. ప్రస్తుతం భూగర్భజలాలు పెరిగి బావుల్లో నీటి ఊటలు వస్తుండడంతో బోర్లకు బదులు బావులను తవ్విస్తున్నారు.
ఇవి కూడా చదవండి..